ప్రభుత్వ వైద్యశాలలో ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ
నరసరావుపేట: జాతీయ పల్స్పోలియో కార్యక్రమం సందర్భంగా ఆదివారం జిల్లాలో 98శాతం ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుచేసిన పోలియో కార్యక్రమ ప్రారంభానికి ముఖ్యఅతిఽథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, జిల్లా రెవెన్యూ అధికారి అద్దెయ్య హాజరయ్యారు. పలువురు పసిబిడ్డలకు పోలియో చుక్కలు వేశారు. జిల్లాలో మొత్తం 1,89,772 మంది 0–5ఏళ్లలోపు పిల్లలు ఉండగా సాయంత్రం ఐదుగంటల వరకు వారిలో 98శాతం మందికి పోలియో చుక్కలు వేసినట్లు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి.రవి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 1012 పోలియో బూత్లు, 26ట్రాన్సిట్ బూత్లు(బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు), 77 మొబైల్ బూత్లు ఏర్పాటు చేయటం ద్వారా సాధించామన్నారు. వచ్చే రెండు రోజుల్లో మిగతా పిల్లలకు ఇంటింటికి వెళ్లి చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. చుక్కలు వేయించేందుకు పలువురు తల్లులు తమ పసిబిడ్డలతో హాజరయ్యారు. వైద్యశాల అబివృద్ధి కమిటీ అధ్యక్షులు డాక్టర్ లక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ రోహిణి రత్నశ్రీ, జిల్లా ప్రభుత్వ వైద్యశాలల పర్యవేక్షణాధికారి డాక్టర్ ప్రసూన, డెప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ హనుమకుమార్, పలువురు డాక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.


