పెదకూరపాడు: ద్విచక్రవాహనానికి గేదెలు అడ్డు రావడంతో దంపతులు ప్రమాదానికి గురయ్యారు. భర్త పరిస్థితి ప్రమాదకరంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటన కాశిపాడు అడ్డరోడ్డు వద్ద మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. తమ్మవరం గ్రామానికి చెందిన గుడేటి ప్రవీణ్ రాడ్ బెండింగ్ పనులు నిర్వహిస్తూ అమరావతిలో నివసిస్తున్నాడు. పనులు ముగించుకుని మంగళవారం పాటిబండ్ల వెళ్లేందుకు భార్య శ్రావణితో కలసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. వీరి వాహనం కాశిపాడు అడ్డరోడ్డు దాటి పరసకు చేరుకునే క్రమంలో రోడ్డుకు అడ్డుగా గేదెలు రావటంతో ప్రమాదం చోటుచేసుకుంది. వీరి వాహనం గేదెలను బలంగా ఢీకొట్టడంతో రోడ్డుపై ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ప్రవీణ్ తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావటంతో పరిస్థితి విషమంగా మారింది. శ్రావణికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ ఇరువురిని స్థానికులు 108 వాహనం ద్వారా పెదకూరపాడు సామాజిక ఆరోగ్యకేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్కు తరలించారు.
మంగళగిరి రూరల్: మంగళగిరి క్రికెట్ స్టేడియంలో బుధవారం నుంచి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్స్ ప్రారంభం కానున్నాయి. స్టేడియంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మంగళవారం పరిశీలించారు. తొలి రోజు మ్యాచ్ తిలకించేందుకు ప్రముఖ సినీ నటుడు రామ్చరణ్, మంత్రి నారా లోకేష్, తదితరులు రానున్న నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా స్టేడియం కెపాసిటీ 26 వేలు ఉన్నప్పటికీ 10 వేల నుంచి 15 వేల మంది ప్రేక్షకులకు మాత్రమే అనుమతిస్తున్నట్లు తెలిపారు.


