
హాస్టళ్ల నిర్వహణపై చిత్తశుద్ధి లేదు
నరసరావుపేట: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సంక్షేమ హాస్టళ్ల నిర్వహణపై ఏమాత్రం చిత్తశుద్దిలేదని మాజీ ఎమ్మెల్యే, జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. పార్టీ తరపున ఇచ్చిన హామీ మేరకు శుక్రవారం రామిరెడ్డిపేట పాతసమితి కార్యాలయం రోడ్డులోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల వసతి గృహం–2కు పది ఫ్యాన్లు, లైట్లు శుక్రవారం అందజేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గత నెల 28వ తేదీన ఇదే హాస్టల్ను పరిశీలించి అక్కడి విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని వారికి ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేస్తామంటూ హామీ ఇచ్చిన విషయం విదితమే. డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ మూడు రోజుల క్రితం ఎస్సీ హాస్టల్స్ను తనిఖీచేసి అక్కడి పరిస్థితులను పర్యవేక్షించడం జరిగిందన్నారు. ఈ హాస్టల్లో విద్యార్థులు చదువుకోటానికి లైట్లు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులను చూశామని తెలిపారు. దీంతో ఎనిమిది ఫ్యాన్లు, లైట్లు సమకూర్చామన్నారు. దీనికి సహకరించిన దాతలైన బత్తుల విష్ణు, అన్నా చంద్రమోహన్, విద్యార్థి విభాగ జిల్లా నాయకులు గుజర్లపూడి ఆకాష్, వేణులకు పార్టీ తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్కు సమస్యలు తెలియచేస్తాం
జిల్లా కలెక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని విద్యార్థులకు కావలసిన తాగునీరు, ఇతర సదుపాయాలు కల్పించే కార్యక్రమం చేయాలని తెలియజేస్తామన్నారు. హాస్టళ్లను క్లీన్ చేయడానికి ఏర్పాటు చేయమని, మంచి బియ్యం సరఫరా చేయమని, నాణ్యత కలిగిన బియ్యం సరఫరా చేసి మంచి భోజనం విద్యార్థులకు పెట్టేవిధంగా ఏర్పాటు చేయమని విన్నవిస్తామన్నారు.
పెద్దచెరువు హాస్టల్లో....
కొంతమంది యువకులు డ్రగ్స్ తీసుకొని, మందుతాగి పెద్దచెరువులోని హాస్టల్ ప్రహరీ దూకి లోపలికివచ్చి అక్కడే మద్యం సేవించి చిన్నపిల్లలపై దాడి చేస్తున్నారన్నారు. ఇది చాలా దారుణమైన అంశమని అన్నారు. కుళ్లిపోయిన కూరగాయలతో వంట చేస్తున్నారని, అన్నం సరిగా లేదని అన్నారు. ఎస్పీకి ఫోన్చేస్తే టూ టౌన్ సీఐ, ఎస్ఐలను పంపించి పరిస్థితి చక్కదిద్దారన్నారు. నైట్ వాచ్మన్ను కూడా ఏర్పాటుచేసే కార్యక్రమం చేస్తున్నారన్నారు. తమ పార్టీ వసతి గృహాలలో చదివే విద్యార్థులకు తోడుగా ఉంటుందని అన్నారు.
మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కళాశాల ఎస్సీ బాలుర హాస్టల్కు ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయించిన డాక్టర్ గోపిరెడ్డి హాస్టళ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని కోరుతూ కలెక్టర్ను కలుస్తాం
మేము రాజకీయం చేయడం లేదు
కేవలం విద్యార్థులు చదువుకునేందుకు మంచి ఏర్పాట్లు ఉంటే, మంచి మార్కులు సాధిస్తారని, ఉన్నత చదువులకు వెళ్లి ఉన్నత ఉద్యోగాలు సాధిస్తారనే ఈ కార్యక్రమం చేపట్టాం తప్ప, ఇది రాజకీయం కాదని డాక్టర్ గోపిరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కార్యదర్శి ఎస్.సుజాతాపాల్, విద్యార్థి విభాగ జిల్లా అధ్యక్షులు గుజ్జర్లపూడి ఆకాష్కుమార్, నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బూదాల కల్యాణ్, పట్టణ అధ్యక్షులు షేక్ కరిముల్లా, వర్కింగ్ అధ్యక్షులు అచ్చి శివకోటి, మండల పార్టీ అధ్యక్షులు తన్నీరు శ్రీనివాసరావు, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షులు షేక్ రెహమాన్, చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మాజీ అధ్యక్షులు కొత్తూరి కిషోర్బాబు, గిరిజన కార్పొరేషన మాజీ డైరెక్టర్ పాలపర్తి శ్రీనివాసరావు, దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి, సానికొమ్ము సాంబిరెడ్డి, పీడీ కృష్ణారెడ్డి, పలువురు విద్యార్థి సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.