
తాగినోళ్లకు తాగినంత..!
● సమయపాలన లేకుండా మద్యం విక్రయాలు ● ప్రైవేటు వ్యక్తులతో కూటమి ప్రభుత్వం వ్యాపారం ● అధికారుల పర్యవేక్షణ లేమితో నిర్వాహకుల ఇష్టారాజ్యం ● పాలకుల కాసుల కక్కుర్తితో రోడ్డున పడుతున్న నిరుపేదలు
కాసుల కక్కుర్తితో వేళాపాళాలేని మద్యం వ్యాపారాలకు నిరుపేద జీవితాలు రోడ్డున పడుతున్నాయి. కూటమి కాసుల కక్కుర్తితో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి మద్యం దుకాణాలు వెళ్లాయి. పర్మిట్ రూములతో మూడు బాటిళ్లు.. ఆరు గ్లాసులు అన్నట్లు మద్యం విక్రయాలు సాగుతున్నాయి. ఉదయమంతా కష్టపడి పనిచేసిన నిరుపేదల సొమ్మంతా మందు చుక్కల్లో ఆవిరవుతోంది. సాయంకాలానికి ఇంటికి చేరాల్సిన కూలీ డబ్బులు మద్యం దుకాణానికే సరిపోతున్నాయి. అక్రమాలను అరికట్టాల్సిన ఎకై ్సజ్ అధికార యంత్రాంగం కాసుల మత్తులో మునిగి తేలుతోంది.
నరసరావుపేట టౌన్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం విధానాన్ని పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతులకు అప్పగించింది. ప్రజా ప్రతినిధుల మద్దతుతో వైన్స్ నిర్వాహకులు మద్యం విక్రయాలను అడ్డగోలుగా సాగిస్తున్నారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటతోపాటు చిలకలూరిపేట, వినుకొండ, పిడుగురాళ్ల, మాచర్ల పట్టణాలలో అనుమతులు లేకుండానే మద్యం వ్యాపారులు పర్మిట్ రూములను ఏర్పాటు చేశారు. బహిరంగంగా మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. మైనర్ బాలురకు సైతం మద్యం విక్రయిస్తుంటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చినప్పటికీ ఎకై ్సజ్ శాఖ అధికారులు పట్టించుకోవడంతో వారిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్సీపీ పాలనలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడిపేది. అది వ్యసన నియంత్రణకు దోహదపడిందని ప్రజల అభిప్రాయం. కూటమి ప్రభుత్వం మాత్రం విక్రయాలకూ టార్గెట్లు విధించింది.
ఫిర్యాదు చేసినా స్పందనేది?
మద్యం దుకాణ నిర్వాహకుల అక్రమాల వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు గతంలో ఫిర్యాదు చేశారు. తాము వ్యాపారాలు చేయలేమంటూ తాళాలు వేసి అధికారులకు తాళం చెవులు అప్పగించారు. అయినప్పటికీ ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఎకై ్సజ్ అధికారులు చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కాగితాల్లోనే నిబంధనలు
మద్యం దుకాణాల నిర్వహణకు ప్రభుత్వం సమయ పాలన విధించింది. ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మద్యం విక్రయాలు కొనసాగించాలి. కానీ రేయింబవళ్లు విక్రయిస్తున్నారు. రాత్రి వేళ క్వార్టర్కు రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల నిర్వాహకులు అర్ధరాత్రి వరకు విక్రయిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అక్రమ మద్యం వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోంది. దీంతో విచ్చలవిడిగా లభ్యం అవుతున్న మద్యంతో అనేక అనర్థాలు చోటు చేసుకుంటున్నాయి. నడిరోడ్లపై మందు బాబులు మద్యం మత్తులో నిద్రిస్తూ రాకపోకలకు అంతరాయం సృష్టిస్తున్నారు. రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్, పల్నాడు బస్టాండ్, కోట సెంటర్లలో రాత్రిళ్లు మందుబాబులు ఆయా ప్రాంతాల్లో స్వైరవిహారం చేస్తున్నారు. ప్రకాష్నగర్లో నడిరోడ్లపై తాగిన బీరు సీసాలను పడేస్తున్నారు. ఇప్పటికే అనేక గొడవలు జరిగాయి.అధికారులు మాత్రం స్పందించడం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
బహిరంగ మద్యపానమే..
మద్యం దుకాణాలు ఉన్న పరిసర ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను మద్యం బాబులు అడ్డాలుగా ఏర్పాటు చేసుకున్నారు. బహిరంగంగానే మద్యం తాగుతున్నారు. పట్టణ శివారు ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్ల వద్ద గుంపులుగా సాయంత్రం చేరి మద్యం తాగుతున్నారు. దీంతో అక్కడ నివాసం ఉండే వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు.

తాగినోళ్లకు తాగినంత..!