
పంటలకు జీవన ఎరువులు వాడండి
పిడుగురాళ్ల: రైతులు పంటలకు రసాయన ఎరువుల వాడకం తగ్గించి జీవన ఎరువులు ఎక్కువగా వాడాలని పల్నాడు జిల్లా వ్యవసాయ వనరుల కేంద్రం డీడీ శివకుమారి తెలిపారు. మండలంలోని జూలకల్లు గ్రామంలో శుక్రవారం పత్తి పంటను ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ వేసవిలో వేసిన ముదురు పత్తి పంట ఈ ప్రాంతంలో బాగానే ఉన్నప్పటికీ పోషక విలువలు తక్కువగా ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ అధికారుల సూచనలను రైతులు తప్పనిసరిగా పాటిస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుందని సూచించారు. ఈ పత్తి పంటను పెట్టకు రాకుండా సరైన సమయంలో నీళ్లు పెట్టాలని, అలాగే లింగాకార బుట్టలు, సేంద్రియ ఎరువులు వాడాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పిడుగురాళ్ల ఏడీఏ శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ పథకానికి ఈకేవైసీ చేయించుకొని వారు వెంటనే చేయించుకోవాలని తెలిపారు. కౌలు రైతు కార్డుల కోసం అర్హులైన వారు తమ సమీపంలోని సచివాలయాల్లో సంప్రదించాలని కోరారు. పంట రుణాలు అందించేందుకు అప్పుడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం గ్రామంలోని పత్తి పంటను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, నాయకులు పాల్గొన్నారు.