
నేడు విశాఖలో ‘సిడ్స్’ సదస్సు ప్రారంభం
గుంటూరు మెడికల్: క్లినికల్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ సొసైటీ (సిడ్స్) ఆంధ్ర ప్రదేశ్ చాప్టర్ సదస్సును శనివారం విశాఖపట్నంలో ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఇన్ఫెక్షన్స్ స్పెషలిస్ట్, సిడ్స్ ప్రెసిడెంట్, గుంటూరు హెల్ప్ హాస్పిటల్ అధినేత డాక్టర్ కోనగంటి కల్యాణ చక్రవర్తి తెలిపారు. అరండల్పేటలో శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన సదస్సు వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఫిజీషియన్లు, క్రిటికల్ కేర్ స్పెషలిస్టులు, మైక్రో బయాలజిస్టులు, పీజీ వైద్య విద్యార్థులు సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు. విశాఖపట్నం హోటల్ గ్రీన్ పార్క్లో జరిగే సదస్సులో యాంటీబయోటిక్స్లో వచ్చిన ఆధునిక మందులు, చికిత్స పద్ధతుల గురించి వివరిస్తారన్నారు. ‘రైట్ డ్రగ్ – రైట్ టైమ్– రైట్ స్టేజ్’ అనే నినాదంతో సదస్సు నిర్వహిస్తున్నట్లు వివరించారు. డాక్టర్ వి.రామసుబ్రహ్మణ్యం, డాక్టర్ మోహన్ మహరాజ్, డాక్టర్ శ్రీధర్ శ్రీనివాసన్లు ప్రారంభిస్తారని పేర్కొన్నారు. సీనియర్ సిడ్స్ మెంబర్ డాక్టర్ నర్రెడ్డి సునీత, డాక్టర్ గాయత్రి, డాక్టర్ శ్రీధర్, డాక్టర్ రామసుబ్రహ్మణ్యం తదితరులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు. దేశంలోనే ఇన్ఫెక్షన్లపై పోరాటంలో అతి పెద్ద సొసైటీగా తమ సంస్థకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. సదస్సులో పలు పరిశోధన, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డాక్టర్ కల్యాణ చక్రవర్తి వివరించారు.