
కుటుంబానికి ఆరోగ్యయోగం
● 20 ఏళ్లుగా ఆస్పత్రి
గడపతొక్కని యోగా గురువు
● ఎందరెందరికో ఎస్జీటీ
ఉపాధ్యాయిని రాజ్యలక్ష్మి శిక్షణ
● అంతర్జాతీయ యోగా దినోత్సవం
సందర్భంగా ప్రత్యేక కథనం
నాదెండ్ల/యడ్లపాడు: నాదెండ్ల మండలం కనపర్రులోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలో ఎస్జీటీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న రాజ్యలక్ష్మి యోగా సాధన ద్వారా జీవితాన్ని మలుచుకున్నారు. ఫిరంగిపురం మండలంలోని వేమవరం గ్రామానికి చెందిన రాజ్యలక్ష్మి బీకాం, బీఈడీ, అలాగే ఎంఏ యోగాతో పాటు ఇంగ్లిష్, తెలుగు, హిస్టరీ వంటి విభాగాల్లో కూడా ఆమెకు విద్యా ప్రమాణాలు ఉన్నాయి. ఎంఏ యోగా చదువుకున్న ఆమె యోగా ప్రక్రియను శాసీ్త్రయంగా అభ్యసిస్తున్నారు. స్కై (కుండలిని) యోగ, హఠయోగ, గర్భిణుల యోగా, ఒబేసిటీ యోగా, ఒళ్లు నొప్పులకు సంబంధించిన యోగా వంటి విభాగాల్లో విశేషంగా పరిశోధన కూడా చేస్తున్నారు. ఆమె తమ పాఠశాల విద్యార్థులకు చదువుతో పాటు యోగాసనాలపై శిక్షణ కూడా ఇస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని పాఠశాలల విద్యార్థులకు యోగాలో తర్ఫీదు ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
యోగా గురువుగా 18 ఏళ్లు
రాజ్యలక్ష్మి టీచర్గా పనిచేసిన ప్రాంతాల్లో సత్తెనపల్లి, క్రోసూరు, అచ్చంపేట నందు 2013 నుంచి యోగా గురువుగా సేవలు అందించారు. మొదటి ఐదేళ్లు పూర్తిగా ఉచిత తరగతులు నిర్వహించారు. 2016లో సత్తెనపల్లిలో నిర్వహించిన యోగ సప్తాహానికి రెండు వందల మంది హాజరై డయాబెటిస్ను నియంత్రించగలిగిన ప్రత్యక్ష ఫలితాలు చూశారు. కేవలం తాను పనిచేసిన స్కూల్స్, ఆయా గ్రామాల్లోనే కాకుండా లండన్, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, పారీస్, జర్మనీ తదితర దేశాలకు చెందిన వారికి ఆన్లైన్ విధానంలో యోగా శిక్షణ ఇస్తున్నారు. అలాగే పోస్టల్ ఉద్యోగిగా రెండేళ్ల కిందట రిటైర్డ్ అయిన భర్త పేరారెడ్డి కూడా యోగా గురువే కావడం విశేషం. ఆయన సాయీషా యోగ శిక్షణాలయాన్ని స్థాపించి ఎందరినో యోగా ప్రక్రియ వైపు నడిపిస్తున్నారు. వీరి ఇద్దరి సంతానంలో పెద్ద కుమారుడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులకు యోగా శిక్షణ గురువుగా వ్యవహరిస్తుండగా, చిన్నకుమారుడు కూడా యోగా సాధకుడిగా కొనసాగుతున్నారు. రాజ్యలక్ష్మి తల్లి 75 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ యోగాసనాలు వేయడం విశేషం. యోగాలో మంచి నైపుణ్యం కలిగిన రాజ్యలక్ష్మి కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతున్నారు.