
యోగా దినోత్సవానికి ఏర్పాట్లు పూర్తి
● జిల్లా వ్యాప్తంగా 5 వేల వేదికల వద్ద యోగాంధ్ర కార్యక్రమాలు ● ఏకకాలంలో పాల్గొననున్న రెండు లక్షల మంది ప్రజలు ● జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు వెల్లడి
నరసరావుపేట: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లాలో వేడుకలు ఘనంగా నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు వెల్లడించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో యోగాంధ్ర, బ్లాక్బర్లీ పొగాకు కొనుగోలు అంశాలపై పాత్రికేయులతో ఆయన మాట్లాడారు. మొత్తం ఐదు వేల వేదికల వద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. యోగాంధ్ర యాప్ ద్వారా దాదాపు 10 లక్షల మంది ఔత్సాహికులు నమోదు చేసుకున్నారని, వీరిలో రెండు లక్షల మంది అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, హాస్టళ్లు, గ్రామ–వార్డు సచివాలయాల వద్ద నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని అన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్లో కనీసం 10వేల మంది హాజరవుతారని తెలిపారు. ఆర్కియాలజికల్ సర్వేశాఖ ఆధ్వర్యంలో అమరావతి బౌద్ధ స్తూపం వద్ద రెండు వేల మందితో కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. పట్టణంలోని సత్తెనపల్లి బైపాస్ రోడ్డుకు ప్రత్యేకంగా ‘యోగా స్ట్రీట్’గా నామకరణం చేసి వివిధ శాఖల ఆధ్వర్యంలో రోజూ కార్యక్రమాలు నిర్వహించామన్నారు.
బ్లాక్ బర్లీ రైతులను ఆదుకుంటాం
బ్లాక్ బర్లీ పొగాకుకు గిట్టుబాటు ధర విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని, మద్దతు ధరతో యడ్లపాడు మార్క్ఫెడ్ కేంద్రంలో పంట కొనుగోలు చేస్తామని తెలిపారు. దిగుబడి పెరిగి ధర తగ్గిందన్నారు. సచివాలయ సిబ్బంది ద్వారా ఇప్పటికే 1600 మంది రైతుల రిజిస్ట్రేషన్ పూర్తయిందని, రైతులు పొగాకు గ్రేడింగ్ చేసి తీసుకురావాలని సూచించారు. ఈ ఏడాది క్రాప్ హాలిడే ప్రకటించాలని సూచించారు. దీంతోపాటు మిర్చి, పత్తి వంటి పంటలకు సైతం ప్రత్యామ్నాయాలు వెతకాలన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, డీఆర్వో ఏకా మురళి, జిల్లా వ్యవసాయ అధికారి ఐ.మురళి పాల్గొన్నారు.
అధికారులకు దిశా నిర్దేశం
నరసరావుపేట: యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం నుంచి 21న నిర్వహించబోయే వేడుకల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ముందస్తుగానే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. తాగునీరు, స్నాక్స్, టాయిలెట్స్ తదితర కనీస సౌకర్యాలను కల్పించాలని సూచించారు. మెడికల్ క్యాంపులను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. అన్నిస్థాయిల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. జిల్లా స్థాయిలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు.