
సొంత మండలంలోనే బదిలీ చేయాలి
నరసరావుపేట: తమను సొంత మండలంలోనే బదిలీ చేయాలని సచివాలయ ఉద్యోగులు కోరారు. ఈ మేరకు జీవో నంబరు ఐదును సవరించాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం పట్టణంలో ప్లకార్డులను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయంతోపాటు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి కార్యాలయం, టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుకు వినతిపత్రాలు సమర్పించారు. మధ్యలో గాంధీవిగ్రహం, శివుని బొమ్మ ఐలాండ్, మల్లమ్మ సెంటర్లలో మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ప్రమోషన్ ఫస్ట్–ట్రాన్స్ఫర్ నెక్స్ట్, క్యాడర్ తక్కువ–కొరడాలు ఎక్కువ, వార్డు నుంచి ఇద్దరికే బదిలీకి అవకాశం కల్పించాలి తదితర నినాదాల ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా స్టేట్ మీడియా కో ఆర్డినేటర్ షేక్ మహమద్ అలీ మాట్లాడుతూ బదిలీలకు సంబంధించిన జీవోను ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నామన్నారు. తామంతా గ్రూప్–4 ఉద్యోగులమని, తమకు నెలకు రూ.30 వేల జీతం మాత్రమే వస్తోందన్నారు. ఈ జీతంతో వేరే మండలాలకు పిల్లలు, వృద్ధులతో కుటుంబాలను తీసుకెళ్లి ఉద్యోగ బాధ్యతల నిర్వహణ ఆర్థికభారంతో కూడుకున్న విషయమన్నారు. తమలో 50శాతానిపైగా మహిళలే ఉన్నారన్నారు. తామంతా ఉదయం 5 గంటల నుంచే విధి నిర్వహణలో పాల్గొంటున్నామని, సర్వేలన్నీ తామే పూర్తి చేస్తున్నామన్నారు. ఈ కేడర్లో ఉన్న తమను సొంత మండలాల్లో ఉద్యోగం చేయకూడదనటం చాలా దారుణమని అన్నారు. బయటి మండలాలకు వెళ్లి మహిళలు ఏవిధంగా సర్వీసు చేస్తారని ప్రశ్నించారు. ఒక వేళ తప్పనిసరిగా తమను మార్చాలని అనుకుంటే జూనియర్ అసిస్టెంట్ కేడర్గా తమను పెంచాలని, సాంకేతిక ఉద్యోగులకు వారికి తగ్గట్లుగా జీతాలు ఇవ్వాలని, సీనియర్ అసిస్టెంట్ కేడర్కు పదోన్నతులు కల్పించాలని కోరారు. ఇప్పటికే రేషనలైజేషన్ పేరుతో రెండు వార్డులను కలిపి బాధ్యతలు అప్పగించటంతో పనిభారంతో ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని వాపోయారు. మిగులు ఉద్యోగులను ఏం చేస్తున్నారనే దానిపై ప్రభుత్వానికి క్లారిటీ లేదని అన్నారు. జీవో నంబరు ఐదును సవరించి సొంత మండలాల్లో పనిచేసే అవకాశం కల్పించాలన్నారు. వార్డు నుంచి వార్డుకు బదిలీ చేయాలని సూచించారు. ఉద్యోగులు షేక్ కరిముల్లా, కె.విజయలక్ష్మి, పి.రమేష్, ఎం.రమేష్నాయక్, మహిమజ్యోతి, షేక్ మున్నా తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాన్ని కోరిన సచివాలయ ఉద్యోగులు జీవో నెం.5 సవరించాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శన