
పొగాకు కొనుగోలు కేంద్రం ప్రారంభం
యడ్లపాడు: పొగాకు కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ప్రారంభించారు. యడ్లపాడు మండలం మైదవోలు–వంకాయలపాడు పరిధిలోని స్పైసెస్ పార్కు ఏపీ గిడ్డంగుల సంస్థ గోదాములో మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటైంది. రైతులు తెచ్చిన బేళ్ల నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం డీఏవో మురళీ అధ్యక్షత వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 99 వేల క్వింటాళ్ల దిగుబడి రాగా, కొందరు రైతులు మాత్రమే విక్రయించుకోగలిగారన్నారు. జిల్లాలో 2,505 మంది పొగాకు రైతులకు ఇప్పటి వరకు 1,600 మంది ఏపీసీఎం యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వివరించారు. నాణ్యమైన నల్లబర్లీ పొగాకుకు క్వింటాకు రూ.12 వేలు, తక్కువ నాణ్యత ఉంటే రూ.6 వేల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మురళి, ఆర్డీవో మధులత, మార్కెఫెడ్ ఉమ్మడి గుంటూరు జిల్లా మేనేజర్ టి.నర్సింహారెడ్డి, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ బి.మురళీకృష్ణ, డీసీఎంఎస్ (బిజినెస్) డి.హరగోపాల్, ఏపీఎస్డబ్ల్యూసీ మేనేజర్ బి.సురేష్, ప్రభుత్వ పొగాకు బయ్యర్ చెరుకూరి నాగేశ్వరరావు, ఐటీసీ జీఎస్–3 హెచ్ఆర్ మేనేజర్ కందుల బాలాజీ, ఏవో హరిప్రసాద్, తహసీల్దార్ జె.విజయశ్రీ, ఎంపీడీవో వి.హేమలతాదేవి తదితరులు పాల్గొన్నారు.
మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు