
సికిల్ సెల్ వ్యాధిపై అవగాహన అవసరం
సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి మల్లికార్జున నాయక్
మంగళగిరి: సికిల్ సెల్ వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ప్రభుత్వ సాంఘిక, గిరిజన సంక్షేమం శాఖ కార్యదర్శి ఎం.మల్లికార్జుననాయక్ తెలిపారు. ప్రపంచ సికిల్ సెల్ దినోత్సవం సందర్భంగా మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని ఆల్ ఇండియా మెడికల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్(ఎయిమ్స్)లో గురువారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, గిరిజన వర్గాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జుననాయక్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని తెలిపారు. వారసత్వంగా వచ్చే రుగ్మతకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో భాగంగా ప్రజల్లో అవగాహన పెంచాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ సరస్వతి, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ప్రసన్న, బ్లడ్ సెల్ కన్సల్టెంట్ డాక్టర్ సోనియా మోహన్, డీఎంహెచ్వో డాక్టర్ విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రంగారావు, ఎయిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్ శ్రీమంత్కుమార్ దాస్, ఎయిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్మోహన్ పాల్గొన్నారు.