
జాయింట్ ఎల్పీఎన్ సమస్యకు శాశ్వత పరిష్కారం
నరసరావుపేట సర్వేశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్
యడ్లపాడు: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో జాయింట్ ల్యాండ్ పార్శిల్ నంబర్ (ఎల్పీఎన్)తో ఇబ్బందులు పడుతున్న రైతులు సబ్–డివిజన్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నరసరావుపేట సర్వేశాఖ డిప్యూటీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కోరారు. గురువారం యడ్లపాడు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన, తహసీల్దార్ జెట్టి విజయశ్రీతో సమావేశమై జాయింట్ ఎల్పీఎం, సబ్–డివిజన్ కార్యాచరణపై చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి ఒకే జాయింట్ ఎల్పీఎన్తో 10 ఎకరాలకు మించి భూమి కలిగి ఉండటం వల్ల కొందరు అర్హత ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం వంటి సంక్షేమ పథకాల నగదును పొందలేకపోతున్నారని శ్రీనివాస్ తెలిపారు. నరసరావుపేట డివిజన్లో పరిధిలో ఈ తరహావి మొత్తం 6,416 జాయింట్ ఎల్పీఎంలు ఉండగా, ఒక్క యడ్లపాడు మండలంలో 1872 జాయింట్ ఎల్పీఎంలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ జాయింట్ ఎల్పీఎంలను సబ్–డివిజన్ చేస్తున్నట్లు శ్రీనివాస్ స్పష్టం చేశారు. రైతులు కేవలం రూ.50 రుసుముతో గ్రామ సచివాలయాల్లో వెంటనే సబ్–డివిజన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 30లోపు సబ్–డివిజన్ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. మండల సర్వేయర్ సురేంద్రతో పాటు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.