
హైవేపై మూడు వాహనాలు ఢీ
మార్టూరు: జాతీయ రహదారిపై ఒకదాని వెనుక మరొకటిగా వెళుతున్న మూడు వాహనాలు పరస్పరం ఢీకొన్న సంఘటన స్థానిక రాజుపాలెం, డేగరమూడి రెస్ట్ ఏరియా సమీపంలో గురువారం సాయంత్రం జరిగింది. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నాయక్, శ్రీహరి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలుకు చెందిన పద్మనాభయ్య శెట్టి తన వాహనంలో చిలకలూరిపేట నుంచి ఒంగోలు వెళ్తున్నాడు. రెస్ట్ ఏరియా సమీపంలోకి వెళ్లగానే వాహనాన్ని వెనుక నుంచి గ్రావెల్ తరలించే టిప్పర్ వాహన డ్రైవర్ బలంగా ఢీ కొట్టి రహదారి మధ్యలో తన వాహనాన్ని నిలిపివేశాడు. అదే మార్గంలో విజయవాడ నుంచి కృష్ణపట్నం పోర్టుకు వెళుతున్న కంటైనర్ వాహనం హఠాత్తుగా అడ్డుగా వచ్చిన టిప్పర్ వెనుక నుంచి బలంగా ఢీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు మూడు వాహనాలు ధ్వంసం అయినప్పటికీ వాహనాల్లోని వ్యక్తులకు ఎలాంటి గాయాలు కాకపోవటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న హైవే పెట్రోలింగ్, ట్రాఫిక్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని రహదారికి అడ్డంగా ఉన్న వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూశారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ వాహనాన్ని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.