
మహిళల రక్షణకు కమిషన్ ప్రాధాన్యం
గుంటూరు వెస్ట్: మహిళల రక్షణకే జాతీయ మహిళ కమిషన్ ప్రాధాన్యత ఇచ్చి పనిచేస్తుందని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు డాక్టర్ అర్చనా మజుందార్ అన్నారు. బుధవారం రాత్రి స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో మజుందార్తోపాటు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్తేజ, జిల్లా ఎస్పీ సతీష్కుమార్, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చనా మజుందార్ మాట్లాడుతూ.. మహిళలు తమ హక్కులను కాపాడుకోవడానికి హెల్ప్లైన్, మెయిల్ ద్వారా కమిషన్కు ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చన్నారు. సామాజికంగా, ఆర్థికంగా మహిళకు రక్షణ కల్పించడానికే కమిషన్ ఉందని పేర్కొన్నారు. మహిళలపై గృహ హింస, లైంగిక హింస, వరకట్నం, హత్యాయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారు తమ హక్కులను కాపాడుకోవడానికి ధైర్యంగా ముందుకు రావాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, టీనేజర్లు, మొబైల్ ఫోన్ ద్వారా చాటింగ్, హార్మోన్ ప్రభావం వల్ల ఇతర కారణాలతో ఆకర్షితులై తప్పుదోవ పడుతున్నారని పేర్కొన్నారు. తాను కొన్ని ఆసుపత్రులను సందర్శించినప్పుడు టీనేజర్లు ప్రెగ్నెన్సీ, ట్రాఫికింగ్లో అధికంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. ఇలాంటి సంఘటనలు నిరోధించడానికి స్వయం సహాయక సంఘాలు బాధ్యత తీసుకుని అవగాహన కల్పించేందుకు కృషి చేయాలన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిత్యం పిల్లలను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలన్నారు. సమావేశంలో రాష్ట్ర మహిళ, మిషన్ శక్తి అసిస్టెంట్ డైరెక్టర్ కె.ఎల్.ఆర్.కుమారి, డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.