
ఇవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే ..
● మాజీ మంత్రి విడదల రజిని
● ప్రభుత్వం తక్షణం నష్టపరిహారం
ప్రకటించాలని డిమాండ్
చిలకలూరిపేట: పండించిన పంటలకు గిట్టుబాటు ధర లభించక, పంటలు అమ్ముకోలేని దుస్థితిలో ఇరువురు రైతులు ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో బాధాకరమని మాజీ మంత్రి విడదల రజిని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలేక, అప్పుల బాధ తాళలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన పల్నాడు జిల్లా నాదెండ్ల మండలానికి చెందిన రైతులు నాశ్యం ఆదినారాయణ(45), శిరిబోయిన గోపాలరావు(43)ల మృతదేహాలు చిలకలూరిపేట ఏరియా ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తీసుకురాగా మాజీ మంత్రి మృతదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఇద్దరు రైతుల మరణాలు ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు. రాష్ట్రంలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించటంలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం తక్షణం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.