
అభ్యుదయ రైతు శేషారావును ఆదర్శంగా తీసుకోవాలి
ప్రకృతి వ్యవసాయ డీపీఎం అమల కుమారి
పెదకూరపాడు: అభ్యుదయ రైతు అవార్డు గ్రహీత దర్శి శేషారావును ఆదర్శంగా తీసుకోవాలని ప్రకృతి వ్యవసాయ డీపీఎం అమలకుమారి కోరారు. మంగళవారం శేషారావు పొలంలో పీఎండీఎస్ వేసిన పైరును ఆమె పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ 30 రకాల విత్తనాలు చల్లి 45 రోజుల తర్వాత భూమిలో కలయదున్నడం ద్వారా భూసారం పెరుగుతుందన్నారు. అంతేకాకుండా కార్బన్ శాతం పెరిగి, నేల ఆరోగ్యకరంగా ఉంటుందన్నారు. పొడి వాతావరణంలో అయినా పైరు పచ్చగా ఉంటుందన్నారు. మిరప పంట వేసేవారు ఇప్పుడైనా పీఎండీఎస్ చల్లుకోవచ్చన్నారు. పత్తి, ఇతర అపరాల పంటలు వేసేవారు ప్రధాన పంటతోపాటు సమాంతరంగా ఐదు ప్రధానమైన పంటలు విత్తుకోవాలన్నారు. తీగజాతి పైరు, గింజ జాతి పైరు, చెట్టు జాతి పైర్లను వేసుకోవాలన్నారు. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది అమూల్య, ఉదయలక్ష్మి, మహబూబీ, జ్యోత్స్న పాల్గొన్నారు.