
రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచిన బాబు
వినుకొండ: కూటమి ప్రభుత్వం ఏడాదిపాలనలో ఐదుకోట్లమంది ఆంధ్రులను వెన్నుపోటు పొడవటం తప్ప చేసిందేమీలేదని వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ పీఏసీ సభ్యులు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పేర్కొన్నారు. వినుకొండలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బొల్లా బ్రహ్మనాయుడు పాల్గొని జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం అనే పుస్తకాన్ని పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం బొల్లా మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లు ఎన్నికలముందు ఇచ్చిన హామీలు మరచి పోయారని ఒక్క రెడ్బుక్ అమలు తప్ప, ఎన్నికల వాగ్దానాల అమలు లేదన్నారు. ఎన్నికలముందు ఇచ్చిన హామీలల్లో ఏఒక్కటీ పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఉన్న పింఛన్లు తీసివేయడం, అమ్మఒడి పథకంలో ఉన్న పేర్లను తొలగించడం వంటి పనులు తప్ప చంద్రబాబు సర్కారు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇసుక, మట్టి, రేషన్ బియ్యాన్ని ఏరియాలవారీగా పంచుకుని ప్రతి పనికి ఒక రేటు ఖరారు చేసి వసూలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం పేరిట టీడీపీ నేతలు చెలరేగుతున్నారని, వినుకొండలో రషీద్తో పాటు, టీడీపీ నాయకుల చేతిలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, హత్యా రాజకీయాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు రైతుభరోసా ఇవ్వకుండా చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని, పంటలకు గిట్టుబాటు ధర లేక ఎంతో మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రెంటపాళ్లలో జరిగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనను నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు జగన్ అంటే నమ్మకం – చంద్రబాబు అంటే మోసం పుస్తకావిష్కరణ