
సాఫ్ట్వేర్ ఉద్యోగాల పేరుతో మోసం
నరసరావుపేట రూరల్: సాప్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నకిలీ కాల్ లెటర్స్తో యడ్లపాడు మండలం ఉన్నవకు చెందిన మెట్టల రమేష్, మోసం చేసినట్టు అనంతపురానికి చెందిన యువతీ, యువకుడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావుకు ఫిర్యాదు చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. 81 అర్జీలు స్వీకరించారు.
● రెండు సంవత్సరాల క్రితం ఇంజినీరింగ్ పూర్తి చేసుకున్న అనంతపురం జిల్లా గుత్తి మండలం ఉన్నవ గ్రామానికి చెందిన షేక్ సన, గుంతకల్లుకు చెందిన ఆసీఫ్లకు సాఫ్ట్వేర్ ఉద్యోగం కల్పిస్తానని రమేష్ నమ్మబలికాడు. వీరి నుంచి రూ.5.2 లక్షల తీసుకొని నకిలీ కాల్ లెటర్స్ ఇచ్చి మోసం చేశాడు. నగదు తిరిగి ఇవ్వాలని పలుమార్లు కోరినా రమేష్ స్పందించకపోవడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు.
● నరసరావుపేటకు చెందిన అమరా వెంకటేశ్వరరావు తమ వద్ద రూ.8 కోట్లు అప్పుగా తీసుకున్నారని, ఆయన మృతిచెందిన తరువాత భార్య సుధారాణి అప్పును తాను చెల్లిస్తానని హామీ ఇచ్చింది. నెల రోజులుగా ఆమె కనిపించకుండా వెళ్లిపోయిందని తమకు న్యాయంచేయాలని బాధితులు ఎస్పీని కోరారు.
● రొంపిచర్ల మండలం అలవాలలో బావిలో పడి దాసరి సురేష్ మృతి చెందిన ఘటనపై తమకు అనుమానాలు ఉన్నాయని, రీపోస్ట్ మార్టం నిర్వహించి నిజాలు వెలికితీయాలని ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు ఎస్పీని కోరారు.
● రష్యాలో పని కల్పిస్తామని ముంబైకి చెందిన రాజీబ్ తమను మోసం చేసినట్టు నకరికల్లుకు చెందిన చిలుకా రాజు ఫిర్యాదు చేశాడు. వీసా కోసం రూ.2లక్షలు చెల్లించామని తెలిపాడు. వీసా వచ్చిందంటే నమ్మి ముంబై వెళ్లగా నకిలీ విమాన టికెట్లతో మోసానికి పాల్పడ్డాడని ఫిర్యాదు చేశారు.
ఇద్దరు నుంచి రూ.5.2 లక్షలు వసూలు
ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు
జిల్లా ఎస్పీ కార్యాలయంలో
ప్రజాసమస్యల పరిష్కార వేదిక