
అసంతృప్తిలో టీడీపీ క్యాడర్..
సాక్షి, టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం కష్టపడిన కార్యకర్తలు ఇప్పుడు ప్రభుత్వం, పార్టీపై ఎంతో అసంతృప్తిగా ఉన్నారని, టీడీపీలో కార్యకర్తలను పట్టించుకోవటం లేదని పల్నాడు జిల్లా దాచేపల్లికి చెందిన టీడీపీ యువ నాయకుడు బొమ్మిరెడ్డి రామకోటయ్య అన్నారు. టీడీపీ నేతలు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలపై రామకోటయ్య మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ వీడియోలో రామకోటయ్య ఏమి మాట్లాడారంటే.... కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం కోసం వైఎస్సార్ సీపీతో గొడవలు పడి ఎన్నో ఇబ్బందులు పడ్డామని, కానీ అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. సూపర్సిక్స్ కమిటీ ఏ కార్యకర్తని పార్టీ కార్యక్రమాలకు పిలిచి మాట్లాడలేదని, అడుగడున కార్యకర్తలను అవమానిస్తున్నారని వీడియోలో పేర్కొన్నారు. టీడీపీ కార్యకర్తలకు ఎటువంటి వ్యాపారంలో భాగస్వాములను చేయకుండా పెద్ద నాయకులే అన్నింట్లో ఉన్నారని రామకోటయ్య ఆరోపించారు. మా లాంటి కార్యకర్తలకు పార్టీ ఏమి చేయలేకపోతుందని, మనకి ఓటు వేసినవారికి కూడా ఏమి చేయలేకపోతున్నామని చెప్పారు. బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నారని, పార్టీ కోసం కష్టపడిన మమ్మల్ని ఏవరు పట్టించుకోవటం లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి టీడీపీ నాయకులు తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అమలు కమిటీ మాకు అంతా అనుకూలంగా లేదని, ప్రతిపక్ష పార్టీ నేతలతో కలిసి వ్యాపారాలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, స్పందించి టీడీపీ కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆ వీడియోలో విన్నవించారు.
కార్యకర్తలను పట్టించుకోవటంలేదు..
నాయకులు సిండ్కేట్
టీడీపీ నాయకుడు బొమ్మిరెడ్డి రామకోటయ్య