
‘104’ ఉద్యోగులకు సత్వరం జీతాలు చెల్లించాలి
నరసరావుపేట: జిల్లాలో 104 సర్వీసుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారందరికీ వెంటనే జీతాలు, బకాయిలు చెల్లించాలని ఏపీ 104 ఎం.ఎం.యు ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) నాయకులు కోరారు. ఈ మేరకు కోటప్పకొండ రోడ్డులోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం సీఐటీయూ జిల్లా నాయకుడు గుంటూరు విజయకుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అధ్యక్ష, కార్యదర్శులు డి.కోటిరెడ్డి, ఉపాధ్యక్షులు షేక్ సుభాని మాట్లాడుతూ గత నెల 15వరకు సర్వీసులను అరబిందో యాజమాన్యం నిర్వహించగా, నూతనంగా భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం నిర్వహణ చేపట్టిందన్నారు. అయితే గత రెండుమూడు నెలలుగా ఉద్యోగులకు చెల్లించాల్సిన జీతాలు, బకాయిలు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగులకు ప్రతీ నెల వేతనాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే జిల్లాలో ఖాళీగా ఉన్న స్థానాల్లో సీనియారిటీ ప్రకారం బదిలీలు చేసి మిగతా స్థానాల్లో కొత్త నియామకాలు చేపట్టాలని కోరారు. గత ఐదేళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోని వాహనాలను వెంటనే మరమ్మతులు చేయించాలని, ప్రస్తుత యాజమాన్యంగా వున్నా భవ్య హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ప్రతీ నెల అన్నీ జిల్లాల్లో గ్రీవెన్స్ మీటింగ్ నిర్వహించి సమస్యలు పరిస్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. కోశాధికారి జిలానీ, ఉద్యోగులు పాల్గొన్నారు.