
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
సత్తెనపల్లి: ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సత్తెనపల్లి మండలం పాకాలపాడు గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ముప్పవరపు రమణయ్య (44) గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. సత్తెనపల్లి వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. రమణయ్యకు భార్య అంజలి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. కుమార్తెలకు వివాహమైంది. 2.70 ఎకరాలు గ్రామంలో పొలం కౌలుకు తీసుకొని పత్తి, పొగాకు సాగు చేస్తుండగా నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు పెరిగి రమణయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు సత్తెనపల్లి రూరల్ పోలీసులకు తెలిపారు. కారు డ్రైవర్గా కూడా పనిచేస్తుంటాడని సమాచారం. తహసీల్దార్ కేఎస్ చక్రవర్తిని దీనిపై సంప్రదించగా.. త్రిమెన్ కమిటీ నిర్ధారించాల్సి ఉందని, కౌలు రైతు అయితే పూర్తి స్థాయిలో పోలీసు, రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు వివరాలను సేకరించాల్సి ఉంటుందన్నారు.