
సూర్య ఘర్ రిజిస్ట్రేషన్లు లక్షకు చేరాలి
నరసరావుపేట: ఈ నెల 25వ తేదీ నాటికి జిల్లాలో లక్ష ప్రధానమంత్రి సూర్యఘర్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్బాబు ఆదేశించారు. ఈ పథకానికి సంబంధించి కలెక్టరేట్లో శుక్రవారం విద్యుత్ అధికారులతో సమీక్ష చేశారు. ప్రజలు తమ ఇళ్లలో ఉచితంగా 25 ఏళ్లపాటు నిరంతరాయంగా విద్యుత్ పొందుతూ అదనపు విద్యుత్ ప్రభుత్వానికి విక్రయించి సొమ్ము చేసుకునే వీలు ఈ పథకంలో ఉందన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ, బీసీలకు రూ.98 వేలు, ఇతరులకు రూ.78 వేల వరకు సబ్సిడీతో ప్రతి ఇంటికీ సోలార్ విద్యుత్ అందించే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో 10 వేల సాధారణ కనెక్షన్లు పీఎం సూర్యఘర్ పథకంలో భాగమయ్యే లక్ష్యంతో విద్యుత్ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు జరిగిన అప్లికేషన్ నమోదు, సోలార్ పానెల్ బిగించుట, గ్రిడ్ అనుసంధానం గురించి తెలుసుకున్నారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఎనర్జీ అసిస్టెంట్ నుంచి అసిస్టెంట్ ఇంజినీర్ వరకు ప్రతిరోజు కనీసం పది అప్లికేషన్స్ నమోదు చేయాలని అన్నారు. ఈ ప్రక్రియను ప్రతిరోజు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సమీక్షించాలని సూచించారు. పానెళ్లు బిగించే వారితోనూ మాట్లాడి వినియోగదారులకు త్వరగా పానెల్స్ ఏర్పాటు, బ్యాంక్ నుంచి రుణసదుపాయం తదితరాలను త్వరగా పూర్తిచేయాలని కోరారు. ఇచ్చిన లక్ష్యాలు సాధించకుంటే తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లా పర్యవేక్షక ఇంజినీర్ డాక్టర్ పి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సీహెచ్ రాంబొట్లు, నరసరావుపేట మాచర్ల డెప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్లు సింగయ్య, ఏడుకొండలు, చిలకలూరిపేట సీనియర్ అకౌంట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
సమీక్షలో విద్యుత్ అధికారులకు
కలెక్టర్ లక్ష్య నిర్దేశం

సూర్య ఘర్ రిజిస్ట్రేషన్లు లక్షకు చేరాలి