
సత్తా చాటిన జిల్లా బీచ్ కబడ్డీ క్రీడాకారులు
సత్తెనపల్లి: మచిలీపట్నంలో ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు జరిగిన 12వ జాతీయ స్థాయి బీచ్ కబడ్డీ మెన్ అండ్ ఉమెన్ పోటీలలో పల్నాడు జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపారు. దేశంలోని 29 రాష్ట్రాల క్రీడాకారులు హాజరు కాగా, ఆంధ్రప్రదేశ్ జట్టు ప్రథమ స్థానం సాధించింది. ఇండియా జట్టుకు పల్నాడు జిల్లా క్రీడాకారులు కృష్ణారెడ్డి, గోపి, హరీష్లు ఎంపికయ్యారు. వీరిని పల్నాడు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు మాబుహుస్సేన్, సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు అచ్చిరెడ్డి, రియాజు, శేషయ్య, అనిల్, సభ్యులు సందీప్, సురేష్, ఆనంద్లు శుక్రవారం సత్కరించారు. మాబుహుస్సేన్ మాట్లాడుతూ ప్రతిభ చూపిన క్రీడాకారులను మరింతగా తీర్చిదిద్దుతానన్నారు.
సర్పంచుల పిల్లలకూ ‘తల్లికి వందనం’ అమలు చేయాలి
అమరావతి: గ్రామానికి ప్రథమ పౌరులైన సర్పంచుల పిల్లలకు తల్లికి వందనం కింద ఆర్థిక సాయం బ్యాంకు ఖాతాలో జమ కాలేదని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ పరిషత్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు శుక్రవారం ఒక ప్రటనలో పేర్కొన్నారు. సర్పంచ్ ప్రభుత్వ ఉద్యోగికి ఉన్నట్లుగా సిఎఫ్ఎంఎస్ఐడీ ఉండటం వలన పిల్లలు అనర్హులయ్యారని తెలిపారు. ప్రభుత్వం గౌరవ వేతనంగా రూ.3 వేలు చొప్పున సంవత్సరానికి రూ.36 వేలు మాత్రమ్చే సర్పంచులకు చెల్లిస్తోందన్నారు. దీనిపై ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలన్నారు. రాష్ట్రంలో యాభై శాతం ఎస్సీ ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన సర్పంచులు ఉన్నారన్నారని గుర్తుచేశారు. వీరిలో అత్యధికంగా నిరుపేదలు ఉన్నారని పేర్కొన్నారు.
నగరపాలక సంస్థ
ఎంహెచ్ఓ సరెండర్
నెహ్రూనగర్: నగరంలో పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణలో నిర్లక్ష్య వైఖరి కారణంగా మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ (ఎంహెచ్ఓ) డాక్టర్ ఎం.రవిబాబుని మాతృశాఖకు సరెండర్ చేశామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్ర స్థాయి పర్యటనల్లో పలుమార్లు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సూచించిన పనుల్లో పర్యవేక్షణ లోపం కనపరచడంతో ఆయన్ను సరెండర్ చేశామని పేర్కొన్నారు. పరిపాలన అవసరాల రీత్యా గుంటూరు తూర్పు నియోజకవర్గానికి రామారావు, పశ్చిమ నియోజకవర్గానికి సోమశేఖర్లను ఇన్చార్జి ఎంహెచ్ఓలుగా కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని వెల్లడించారు.