
సమస్యల చదువులు
వేసవి సెలవుల అనంతరం గురువారం బడుల తలుపులు తెరుచుకున్నాయి. సుమారు 50 రోజుల సెలవుల అనంతరం బడి గంటలు మోగాయి. 2025–26 విద్యాసంవత్సరం తొలి రోజే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సమస్యలు స్వాగతం పలికాయి. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులను వసతుల లేమి వేధించింది. ముఖ్యంగా అదనపు తరగతుల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో గదుల కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులు చెట్ల కింద, రేకుల షెడ్లు, వరండాలలో పాఠాలు వినాల్సి వస్తోంది. ఉపాధ్యాయుల బదిలీలు పూర్తి కాకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు.
సాక్షి, నరసరావుపేట : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అదనపు తరగతుల గదుల నిర్మాణం చేపట్టారు. ఎన్నికల రావడంతో పనులు ఆగాయి. తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి నుంచి ఆ నిర్మాణాలు అటకెక్కాయి. దాదాపు 80 నుంచి 90 శాతం పూర్తయిన భవనాలను కూడా ప్రభుత్వం గాలికి వదిలేసింది. వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు కృషి చేయలేదు. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో 1,617 ఉన్నట్టు సమాచారం. అదనపు తరగతుల నిర్మాణం పూర్తికాకపోవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. త్వరగా భవనాలు పూర్తి చేసి విద్యార్థులకు వాటిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
బదిలీల హడావుడిలో ఉపాధ్యాయులు...
వేసవి సెలవుల అనంతరం బడులు ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయులు బదిలీల ప్రక్రియ పూర్తి చేయాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో ప్రక్రియ నేటికీ కొనసాగుతోంది. దీంతో ఉపాధ్యాయులు ఆ హడావుడిలో ఉండిపోతున్నారు. జిల్లాలో మొత్తం 6,582 మంది ఉపాధ్యాయులు బదిలీల జాబితాలో ఉన్నారు. ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ల ప్రక్రియ మాత్రమ పూర్తయింది. మరోవైపు సుమారు 2,900 మంది ఎస్జీటీలకు బదిలీల జరగాల్సి ఉండగా... గురువారం నాటికి 1,750 మందికి పూర్తయినట్టు తెలుస్తోంది. మరో రెండు రోజులపాటు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్ కొనసాగనుంది. మున్సిపల్ టీచర్ల బదిలీలు కూడా జరగాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తయినా ఉపాధ్యాయులందరూ వారి నూతన స్థానాలకు వెళ్లడానికి ఆలస్యమయ్యే అవకాశముంది. ముఖ్యంగా మాచర్ల, వెల్దుర్తి, బొల్లాపల్లి లాంటి మారుమూల ప్రాంతాల నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయులను సగం మందినే ఇప్పుడు రిలీవ్ చేస్తారు. మిగిలిన వారి స్థానంలో నూతన డీఎస్సీ ప్రక్రియ ముగిసిన తరువాత కొత్త ఉపాధ్యాయులు చేరిన తరువాతే రిలీవ్ చేయనున్నారు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేసవి సెలవుల అనంతరం తెరుచుకున్న పాఠశాలలు
కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు అవస్థలు అదనపు తరగతుల నిర్మాణాలు పూర్తికాక చాలాచోట్ల ఇబ్బందులు అరకొరగా బడులకు వచ్చిన కిట్లు.. ప్రస్తుతానికి పుస్తకాలతోనే సరి యూనిఫాం, షూలు త్వరలో వస్తాయంటున్న అధికారులు ఇప్పటికీ పూర్తి కాని ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ గతంలో బడులు తెరిచే నాటికే జగనన్న విద్యాకానుక కిట్లు సిద్ధం
పూర్తి స్థాయిలో రాని కిట్లు...
బడులు తెరుచుకున్న తొలిరోజే విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పినా ఆచరణలో ఘోరంగా విఫలమైంది. పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, డిక్షనరీలు మాత్రమే అందాయి. బ్యాగ్లు 18 మండలాలకు చేరగా, మరో 10 మండలాలకు రాలేదు. యూనిఫాం, షూస్ తదితర సామగ్రి సంగతి సరేసరి. ఈ నెల 20 లేదా 27న మెగా పేరెంట్స్ టీచర్స్ ప్రోగ్రాంలో వాటిని ప్రచారం కోసం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వముంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బడులు తెరిచిన మొదటి రోజే అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లు సరఫరా చేశారు. నాణ్యతలో ఏమాత్రం రాజీ పడకుండా అందజేశారు. కూటమి ప్రభుత్వం కిట్ల సరఫరాలో విఫలమైందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సమస్యల చదువులు