
ఆటో నేర్పే విషయంలో గొడవతోనే హత్య
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని క్రోసూరు మండలం బయ్యవరం గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో సత్తెనపల్లి డీఎస్పీ మెదరమెట్ల హనుమంతరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం... బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసరావు ఈ నెల 3న అమరావతి మండలం తురకవారిపాలెం ఇటుక బట్టీల్లో పనిచేస్తుండగా అమరావతి మండలం మునుగోడు గ్రామానికి చెందిన సాధనాల గోపి పిల్లలకి ఆటో నేర్పే విషయంలో చిన్న గొడవ జరిగింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న సాధనాల గోపి, సాధనాల విజయ్బాబు, కడియం శ్రీకాంత్లు అదే రోజు సాయంత్రం బయ్యవరం గ్రామానికి వెళ్ళి షేక్ శ్రీనివాసరావు ఇంటికెళ్లి కర్రలతో అతడి తలపై విచక్షణరహితంగా దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. వెంటనే గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఈ నెల 6న మృతి చెందాడు. అతడిచ్చిన వాంగ్మూలం ఆధారంగా క్రోసూరు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇతర నేరాల్లో ఇప్పటికే జైలుశిక్ష
సాధనాల గోపి, సాధనాల విజయబాబు కారులో వచ్చి ఆగి ఉన్న లారీల్లో నిమిషంలో 300 లీటర్ల ఆయిల్ను అపహరించి కారులో పెట్టుకుని పారిపోయి దానిని తక్కువ ధరకు విక్రయించేవారు. జల్సాలు చేయడం అలవాటుగా మారింది. ఈ క్రమంలో సులువుగా వచ్చిన డబ్బుతో న్యాయవాదులను సైతం నియమించుకొని పోలీసులకు కూడా సవాలుగా మారారు. ఇటీవల సత్తెనపల్లి, అమరావతిలో కూడా రెండు నేరాలు చేశారు. తీవ్ర ప్రయత్నం చేసి వారిని పట్టుకొని జైలుకు పంపారు. ఈ క్రమంలో బయ్యవరం గ్రామంలో హత్య చేశారన్నారు. పెదకూరపాడు సీఐ పి.సురేష్, క్రోసూరు ఎస్ఐ పి.రవిబాబు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టాయి. ముగ్గురు నిందితులను సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి బయ్యవరం గ్రామ శివారులో అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు సరివి కర్రలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. కేసును ఛేదించిన రెండు బృందాలను డీఎస్పీ అభినందించారు.
బయ్యవరంలో వ్యక్తి హత్య కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు నిందితులు అరెస్ట్