పర్లాకిమిడి: ఈనెల ఒకటో తారీఖున పర్లాకిమిడి స్టేట్బ్యాంకు మెయిన్ బ్రాంచి వద్ద మధ్యాహ్నం జరిగిన రూ.5 లక్షల దోపిడీ కేసులో ఇద్దరు నిందితుల్ని గారబంద పోలీసులు పట్టుకున్నారు. దీనిపై ఆదివారం మోడల్ పోలీసు స్టేషన్లో అదనపు ఎస్పీ బిరంచీ బాగ్ వివరాలు వెల్లడించారు. గుసాని సమితి శైలాడ గ్రామానికి చెందిన ఎం.సూర్యారావు బ్యాంకులో ఐదు లక్షలు విత్ డ్రాచేసి బయటకు వస్తుండగా, ఆయన వెనుక ఉన్న వ్యక్తి డబ్బులు పడిపోయాయని చెప్పాడు. దీంతో అక్కడే ఉన్న మరో నిందితుడు బైక్కు ఉన్న డబ్బు సంచిని పట్టుకుని పారిపోయాడు. ఈ చోరీ కేసులో మొత్తం నలుగురు నిందితులు ప్లాన్ ప్రకారం అమలు చేశారని, వారిలో ఇద్దరు నిందితులు గారబంద పోలీసు స్టేషన్ నాకా గేటు వద్ద ప్రశ్నించగా డబ్బుతో పట్టుబడగా, మరో ఇద్దరు సంఘటన స్థలం నుంచి పరారైనట్టు ఆదనపు ఎస్పీ బిరంచీ బాగ్ తెలియజేశారు. నిందితులు ఆంధ్రప్రదేశ్ పొట్టిశ్రీరాములు జిల్లా, కప్పరాల తిప్ప గ్రామం, బిట్రగుడ పోలీసు స్టేషన్ పరిధిలో పెట్ల దేవదానం అలియాస్ దేవా, మరొకరు గోడ్డేటి సల్మన్ తండ్రి గోడ్డేటి రాములుగా పోలీసులు దర్యాప్తులో తేలింది. వీరి నుంచి రూ.5 లక్షలు నగదు, ఒక మోటార్ సైకిల్, ఐడీ కార్డులు, మొబైల్స్ స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిపై ఆదర్శపోలీసు స్టేషన్లో కేసుపెట్టి సోమవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు ఐఐసీ ప్రశాంత భూపతి తెలియజేశారు. ప్రెస్మీట్లో డీఎస్పీ అమితాబ్ పండా, ఎస్డీపీఓ మాధవానంద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


