స్వామి స్నాన యాత్ర ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

స్వామి స్నాన యాత్ర ఉత్సాహం

Jun 29 2026 12:53 AM | Updated on Jun 29 2026 12:53 AM

భువనేశ్వర్‌:

సోదర సోదరీ సమేతంగా శ్రీ జగన్నాథుడు ఆచారబద్ధమైన స్నానం కోసం సంప్రదాయబద్ధంగా సోమవారం స్నాన మండపాన్ని సందర్శించనున్నారు. శ్రీ మందిరం సుదీర్ఘ మేఘనాథ్‌ ప్రహరి ప్రాంగణంలో స్నాన మండపం రంగులు హద్దుకుని ముస్తాబు అవుతుంది. దైతపతి సేవకులు ఆలయంలోకి ప్రవేశించేయడంతో ప్రాథమిక క్రతువులు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. పవిత్రమైన స్నాన యాత్ర సందర్భంగా, ఈ అరుదైన ఆచారాన్ని వీక్షించేందుకు దేశ వ్యాప్తంగా భక్తులు ఈ పుణ్య క్షేత్రానికి తరలిరావడం ప్రారంభించారు. భక్తుల పోటు క్రమంగా పుంజుకుంటోంది. శ్రీ క్షేత్రం భక్తుల తాకిడితో కళకళలాడుతుంది. పూరీ పోలీసులు యాత్రికుల సౌలభ్యం కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్‌ స్థలాలను ఏర్పాటు చేశారు. నగరంలో మరియు చుట్టుపక్కల తగినంత భద్రతా బలగాలను మోహరించారు.

నేటి స్నాన యాత్ర కాలక్రమం

పవిత్ర జ్యేష్ట పూర్ణిమ పురస్కరించుకుని ఏటా తరహాలో సోమవారం శ్రీ క్షేత్రంలో శ్రీ జగన్నాథుని స్నాన యాత్ర జరుగుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు చివరి దశలో మెరుగులు దిద్దుకుంటున్నాయి. తండోపతండాలుగా తరలి వచ్చే యాత్రికులకు సులభ దర్శనం కల్పించడంతో స్నాన యాత్ర క్రతువుల్ని సకాలంలో క్రమ పద్ధతిలో పూర్తి చేయాలని యంత్రాంగం కృషి చేస్తుంది.

సోమవారం ఉదయం 5 గంటలకు రత్న వేదిక నుంచి మూల విరాటుల్ని వరుస క్రమంలో స్నాన మండపానికి తరలించడం ప్రారంభిస్తారు. ఈ ప్రక్రియ ఉదయం 7 గంటలు సరికి పూర్తి చేయాలని ఖరారు చేశారు. స్నాన మండపంపై దేవతా మూర్తులు ఆసీనులు కావడంతో జగతి నాథుని అభిషేకం కోసం పవిత్ర జలాన్ని కలశాల్లో తరలిస్తారు. మద్యాహ్నం 12 గంటలకు ఈ సన్నాహం ఆరంభించి 2 గంటలు సరికి అభిషేకం ఆరంభించేందుకు నిర్ధారించారు. అశేష భక్త జనం మధ్య భారీ స్నానం ఆచరించిన శ్రీ జగన్నాథుడు గజాననుని రూపంలో భక్తులకు అపురూప దర్శనం ప్రసాదించడం స్నాన యాత్ర ప్రాధాన్యత.

రాఘవ దాస్‌ మఠం, గోపాల తీర్థ మఠం వర్గాలు సిద్ధం చేసిన గజానన అలంకరణ సరంజామా తరలించి సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య అలంకరణ పూర్తి చేస్తారు. అలంకరణ అనంతరం స్నాన మండపంపై అనుబంధ సేవాదులు ముగించి సాయంత్రం 7.30 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు నిరవధికంగా 2 గంటల పాటు భక్తులకు సర్వ దర్శనం సౌకర్యానికి ఏర్పాట్లు చేశారు. శ్రీ మందిరం సింహ ద్వారం గుండా లోనికి ప్రవేశించి స్నాన మండపంపై గజానన రూపధారణలో కొలువైన శ్రీ జగన్నాథుని సోదరసోదరీ సమేతంగా దర్శించుకుని శ్రీ మందిరం లోపల నుంచి మిగిలిన 3 ద్వారాల గుండా వెలుపలకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసి రద్దీ నియంత్రణకు మార్గం సుగమం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement