● జెడ్పీ సమావేశం బహిష్కరించిన సభ్యులు
కొరాపుట్ : ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికై న ప్రజా ప్రతినిధుల హక్కులు హరిస్తూ సమావేశాలు నిర్వహించడం ఎందుకని సభ్యులు మండిపడ్డారు. శుక్రవారం నబరంగ్పూర్ జిల్లా పరిషత్ 9వ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. జెడ్పీ సభ్యులు ఈ సమావేశాన్ని బహిష్కరించారు. జిల్లాలో 26 జెడ్పీ స్ధానాలలో అధికార బీజేపీకి సభ్యత్వం లేదని, కానీ ప్రతి చోట జెడ్పీ నిధులు వినియెగంలో స్థానిక జెడ్పీ సభ్యుల మాటకు విలువ లేకుండా బీజేపీ కార్యకర్తలే నిధులు వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. అధికారం మాటున కార్యకర్తలు బరి తెగిస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యంగా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మర్కోట్లో ఏకపక్షంగా పాలన జరుగుతోందని ధ్వజమెత్తారు. అనంతరం జిల్లా పరిషత్ అధ్యక్షుడు మోతిరాంనాయక్ అధ్యక్షతన కాంగ్రెస్, బీజేడీలకు చెందిన జెడ్పీ సభ్యులు సమావేశాన్ని బహిష్కరించారు. కార్యక్రమంలో నబరంగ్పూర్ ప్లానింగ్ బోర్డు చైర్మన్ గౌరీశంకర్ మజ్జి, డాబుగాం ఎమ్మెల్యే మనోహర్ రంధారి తదితరులు పాల్గొన్నారు.


