పర్లాకిమిడి: గంగాబడ పంచాయతీలో మాణిక్పట్నా, గుడిఖుడి గ్రామాల్లో ఒడిశా రాష్ట్ర జనగణన అధికారులు ఇళ్ల లెక్కింపు సర్వే కార్యక్రమంలో ప్రతి ఇంటిపై రాసిన నంబర్లను ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లా మందస మండలం రెవెన్యూ అధికారులు చెరిపివేయడంతో ఈ ప్రాంతంలో మరోసారి సరిహద్దు సమస్య తలెత్తింది. గజపతి జిల్లా రాయగడ బ్లాక్ గంగాబడ పంచాయతీ సర్పంచు హరిబంధు కార్జి సబ్ కలెక్టర్ అనుప్ పండాకు ఫిర్యాదుచేశారు. దీంతో సబ్ కలెక్టర్ అనుప్ పండా రాయగడ తహసీల్దార్తో పాటు పోలీసు అధికారులను గురువారం వెంటబెట్టుకుని గంగాబడ పంచాయతీలో మాణిక్పట్నా, గుడిఖుడి గ్రామాలను సందర్శించారు. ఒడిశా రాష్ట్ర జనగణన అధికారులు ఇళ్ల లెక్కింపు సర్వేలో ప్రతిఇంటికి మార్కింగ్ చేసిన సంఖ్యలను శ్రీకాకుళం జిల్లా మందస మండలం రెవెన్యూ అధికారులు చెరిపి వేసి వారి సర్వే నంబర్లు వేయడంపై సరిహద్దు సమస్య తలెత్తింది.ఒడిశా ప్రభుత్వం వెనుకబడిన గంగాబడ పంచాయతీలో పలు గ్రామాలకు బిజూ పక్కాఇళ్ల పథకాన్ని 2018లో వర్తింపచేశారు. ఈ సర్వే సమస్యపై ఒడిశా సబ్ కలెక్టర్ అనుప్ పండా స్పందించి ఒడిషా భూభాగంలో ఉన్న గంగాబడ పంచాయతీని మందస మండల అధికారులు తమదని వాదించడం అసందర్భంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ అధికారుల వద్ద గంగాబడ పంచాయితీ ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉన్నట్టు ఎలాంటి ఆధారాలు గతంలో నిర్ధారించలేకపోయారని అన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు వహించి అందజేయాల్సిందిగా సబ్ కలెక్టర్ పండా రాయఘడ తహసీల్దార్కు ఆదేశించారు.


