సోంపేట: మండలంలో గత నెల ఏడో తేదీన కురిసిన వర్షాలకు టమాట పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ పిరియా విజయ, ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టమాట రైతులను ఆదుకోవాలని కోరుతూ గురువారం సమన్వయకర్త శ్యాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జింకిభద్రలో టమాటా పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విజయ మాట్లాడుతూ గత నెలలో కురిసిన వర్షాలకు టమాటా రైతులు, కాయగూరల రైతులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం విస్మరించడం దారుణమన్నారు. శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వలల్ల టమాట పంట నీట మునిగి రైతులు నిండా మునిగారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు సుమారు రూ.40 వేల పెట్టుబడి పెట్టగా.. వర్షాల వల్ల ఒక్క రూపాయి కూడా ఆదాయం రాలేదన్నారు. ప్రభుత్వాలు టమాట పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. మండలంలో 600 ఎకరాల్లో టమాట సాగు చేస్తే ఏప్రిల్ 7న కురిసిన వర్షాలకు పంట మొత్తం పోయిందన్నారు. నేటికీ పంటల బీమా గానీ, పంట పెట్టుబడి సహాయం గానీ అందలేదన్నారు. టమాట పంటకు వాతావరణ ఆధారిత బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్చేశారు. ఈ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి, ప్రభుత్వ విప్ చొరవ తీసుకోవాలన్నారు. ఎంపీపీ డాక్టర్ నిమ్మన దాస్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో టమాటా రైతులను ఆదుకోవాలని విన్నవించామని, అయినా ఇంతవరకు చర్యలు చేపట్టలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి నర్తు నరేంద్రయాదవ్, పార్టీ నాయకులు ఇప్పిలి కృష్ణారావు, సల్ల దేవరాజు, గురాల శ్రీను, బతకల మోహనరావు, తామాడ పద్మావతి, పాతిన శేషగిరి, పిన్నింటి ఈశ్వరరావు పాల్గొన్నారు.


