శ్రీకాకుళం పాతబస్టాండ్: సామాన్య ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించి, వారికి న్యాయ సహాయం అందేలా చేయడంలో పారా లీగల్ వాలంటీర్లు (పీఎల్వీ) వారధిలా పనిచేయాలని మూడో అదనపు జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ అన్నారు. స్థానిక న్యాయ సేవా సదన్లో మూడు రోజుల పాటు జరిగిన పీఎల్వీల అడ్వాన్సడ్ శిక్షణ కార్యక్రమం బుధవారంతో ముగిసింది. ముగింపు సమావేశంలో ఆయన పాల్గొని వాలంటీర్లకు దిశా నిర్దేశం చేశారు. శిక్షణలో భాగంగా మోటారు వాహనాల చట్టం, విద్యా హక్కు, పోక్సో, పర్యావరణ సమస్యలతో పాటు కార్మికులు, దివ్యాంగులు, హెచ్ఐవీ బాధితుల హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. విపత్తుల సమయంలో న్యాయ సేవా సంస్థల ద్వారా బాధితులకు అందే సేవల గురించి వివరించారు. ఈ చట్టాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని వాలంటీర్లను కోరారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.హరిబాబు, ఎంవీఐ గంగాధర్, ప్యానల్ న్యాయవాది అన్నేపు భువనేశ్వరరావు, ఇన్స్పెక్టర్ నారాయణి, విద్యా ఫౌండేషన్ ప్రతినిధి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


