శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలోని వివిధ రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన బాలల నుంచి ‘ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్–2026’ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ధైర్య సాహసాలు, క్రీడలు, సామాజిక సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణం, కళలు, సాంస్కృతిక విభాగాల్లో విశిష్ట గుర్తింపు పొందిన బాలలు ఈ అవార్డుకు అర్హులని పేర్కొన్నారు. 5 ఏళ్లు పైబడి, 31 జూలై 2026 నాటికి 18 ఏళ్లలోపు వయస్సు ఉన్న బాలలు వ్యక్తిగతంగా లేదా ఏదైనా సంస్థ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చని వివరించారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు, పత్రికా క్లిప్పింగ్స్తో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవార్డుల కోసం దరఖాస్తు చేయడానికి జూలై 31 తేదీ వరకు గడువు ఉందని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రతిభావంతులైన బాలలు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
కుక్కకాటుతో ఆటోడ్రైవర్
మృత్యువాత..?
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీప తహసీల్దార్ కార్యాలయం వద్ద ఒక ఆటో డ్రైవర్ బుధవారం మృత్యువాత పడ్డాడు. భామిని మండలం గొరండికి చెందిన నిమ్మల ప్రసాద్ (30) కొంతకాలం క్రితం కుక్కకాటు వేయడంతోనే అనారోగ్యం పాలయ్యాడని, అందుచేతనే చనిపోయివుంటాడని భావిస్తున్నట్లు మృతుని కుటుంబీకులు తెలిపారు. అయితే ఇదే విషయమై రెండో పట్టణ పోలీసుల వద్ద ప్రస్తావించగా తమ దృష్టికొచ్చిందని, ఫిర్యాదు నమోదు కాలేదని చెప్పారు.


