పాతపట్నం: నియోజకవర్గం కేంద్రం పరిధిలో ప్రభుత్వ స్థలాలు దర్జాగా ఆక్రమిస్తున్నారు. సొంత స్థలాలు లాగే విక్రయాలు కూడా చేస్తున్నారు. అధికారులు తమకేమీ సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తుండటంతో రోజురోజుకూ ఆక్రమణలు పర్వం పెరుగుతుంది. స్థానికులు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసిన స్పందించకపోవడంతో ఆక్రమణ స్థలాల్లో పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఆల్ఆంధ్రా రోడ్డు జంక్షన్ నుంచి మెళియాపుట్టి, పలాస ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఆర్అండ్బీ స్థలంలోను తాజాగా ఆక్రమణలు చేసి విక్రయాలు చేపట్టారు. బ్రాహ్మణవీది మెయిన్రోడ్డు నుంచి యశోదనగర్ వెళ్లే వరకు కొంత మంది స్థలాలను సొంతం చేసుకుంటున్నారు. వీరు ఒక్కో దుకాణానికి సరిపోయే స్థలాన్ని రూ.50వేల నుంచి రూ.80 వేలు చొప్పున చిరు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. కొనుగోలు చేసిన స్థలం కాదా అని బీటీ రోడ్డుకు వీరు నిర్మాణాలు జరిపించి వ్యాపారాలు సాగిస్తున్నారు. ఆల్ఆంధ్రా రోడ్డులో తిడ్డిమికి వెళ్లె రహదారిలో ఎక్కువ నిర్మాణాలు చేపడుతున్నారు. ఆర్అండ్బీ, పంచాయతీ స్థలాల్లో ఆక్రమ నిర్మాణాలు చేస్తుండడం విశేషం. సాయంత్రం ఐదు గంటలకే ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది.
ఆల్ఆంధ్రా కూడలిలో రద్దీగా ఉంటుంది. రహదారి పక్క స్థలాలను అమ్ముతున్న మొదట్లోనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, ఆర్అండ్బీ, పంచాయతీ అధికారులు సమన్వయంతో పని చేసి ఆక్రమణలను తొలగించాలని ప్రజలు, ప్రయాణికులు కోరుతున్నారు.


