దొండపంటలో కూలి పనికి వెళ్లిన మజ్జి సత్తెమ్మ, మజ్జి అప్పలనర్సమ్మలు తోటికోడళ్లు. అంత వరకు మాటామంతి ఆడుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. భారీ వర్షంతోపాటు ఒక్కసారిగా పిడుగు పడడంతో మృతిచెందారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు తోటికోడళ్లు మృతిచెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు బోరున విలపించారు. ఘటనా స్థలం రోదనలతో మిన్నంటింది.
అమ్మా.. లే అమ్మా...
మృతురాలు సత్తెమ్మకు భర్త నర్సింహులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో దివ్యాంగురాలైన పెద్దకుమార్తె రమణమ్మ భర్త మూడేళ్ల కిందట మరణించడంతో కన్నవారి ఇంటివద్దనే తన ఇద్దరి పిల్లలతో ఉంటోంది. వారిని కూలిపనులు చేస్తూ సత్తెమ్మ సాకుతోంది. ఇప్పుడు ఆమెను పిడుగు రూపంలో మృత్యువు కాటేయడంతో కుమార్తె రమణమ్మ బోరున విలపించింది. మృతదేహాన్ని పట్టుకుని అమ్మా... లే అమ్మా అంటూ రోదించిన తీరు అక్కడివారిలో కన్నీరు తెప్పించింది.
పొలం వద్దే తనువు చాలించిన అప్పలనర్సమ్మ
మృతిచెందిన సత్తెమ్మ


