భువనేశ్వర్:
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా మారింది. గత 24 గంటల్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయా రు. కెంజొహర్ జిల్లాలోని 9వ నంబరు జాతీయ రహదారి తెంతులి సమీపంలో జరిగిన దర్ఘటనలో మోటార్ సైకిల్ ట్రక్కుకు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తండ్రి, మూడేళ్ల కొడుకు ప్రాణా లు కోల్పోయారు. మృతుడిని మహ్మద్ నూర్గా గుర్తించారు. నూర్ తన భార్య, కొడుకుతో ప్రయాణిస్తుండగా వారి బైక్ వెనుక నుంచి ట్రక్కును ఢీకొట్టింది. అతని భార్య తీవ్రంగా గాయపడి చికిత్స కోసం ఆస్పత్రిలో చేరింది.
జట్నిలో వేగంగా వస్తున్న కారు ఆటోరిక్షాలోకి దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలో వ్యక్తి మృతి చెందాడు. స్థానిక జాతీయ విజ్ఞాన విద్యా, పరిశోధన సంస్థ నైజర్ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారందర్ని చికిత్స కోసం ఖుర్దా జిల్లా ప్రధాన ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో పలు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాలు పలువురి ప్రాణాల్ని బలిగొన్నాయి. బర్గఢ్ జిల్లా మెహ్నా గ్రామం సమీపంలో రెండు మోటార్ సైకిళ్లని బొలెరో వాహనం ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన 4 మంది మృతి చెందారు. సంబల్పూర్ జిల్లా కుచిండా ప్రాంతం పితామరెన్ వద్ద కంటైనర్ ట్రక్కు, మోటార్ సైకిల్ ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు మరణించారు. సుందర్గఢ్లో ఇద్దరు, బొలంగీర్ జిల్లాలో ఒకరు మరణించారు. బారంగ్, పొలొసొర ప్రాంతాల్లో ఒక్కొక్కరు వంతున మరణించారు. స్వల్ప వ్యవధిలో జరిగిన వరుస ప్రమాదాలు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల అమలు వ్యవస్థ పటిష్టత లోపం ఎత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో సగటున రోజుకు 15 మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
పదేళ్లలో 53,451 మంది మృతి
గత 10 సంవత్సరాలలో రాష్ట్రంలో సంభవించిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో 53,451 మంది మరణించారు. ఈ ప్రమాదాల్లో 55,783 మంది తీవ్రంగా గాయపడ్డారు, 45,146 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఈ సంఘటనలకు సంబంధించి 1,13,325 ప్రమాద కేసులు నమోదయ్యాయి. 2024లో రోడ్డు ప్రమాదాలకు సంబంధించి 12,375 కేసులు నమోదయ్యాయి, 6,142 మంది మరణించారు. గత ఏడాది నమోదైన 12,782 రోడ్డు ప్రమాదాల్లో 6,483 మంది మరణించారు.
ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ సోమ వారం జరిగిన రాష్ట్ర శాసన సభ మలి విడత సమావేశాల్లో లిఖితపూర్వక సమాధానంలో ఈ వివరాలు తెలియజేశారు. రోజువారీ రోడ్డు ప్రమాదాల సగటు 31 నమోదు అయింది. ఈ ప్రమాదాల్లో సగటున 27 మంది గాయపడుతున్నారు. శాసన సభలో జరిగిన సమావేశంలో రవాణా మంత్రి బిభూతి భూషణ్ జెనా రోడ్డు ప్రమాదాల్ని విశ్లేషించారు.


