భువనేశ్వర్: పూరీ శ్రీ మందిరంలో ఖొసాపొడా ఆచారం పురస్కరించుకుని చైత్ర కృష్ణ పక్షం షష్టి తిథి సందర్భంగా సోమవారం సాధారణ భక్తుల ప్రవేశం నివారించి దర్శనం తాత్కాలికంగా నిలిపి వేశారు. ద్వితీయ భోగ మండప సేవ పూర్తయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు ఖొసాపొడా ప్రక్రియ ప్రారంభించారు. అది మొదలుకొని సర్వ దర్శనం నిలిపి వేశారు. సుమారు రాత్రి 10 గంటల వరకు ఈ సేవ కొనసాగింది. ఖొసాపొడా లగ్గి ఆచారాన్ని సంవత్సరానికి 2 నుంచి 3 సార్లు శ్రీ మందిరం రత్న వేదికపై కొలువు దీరిన శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్రల శ్రీ పాయరు (పవిత్ర పాదాలు) సంరక్షణలో భాగంగా ఖొ సాపొడా నిర్వహిస్తారు. ఈ పవిత్ర ఆచారంలో భాగంగా దేవతల పాదాలను తెల్లటి వస్త్రంతో కప్పుతారు. ఆచార సమయంలో గర్భగుడిలోకి ప్రవేశం పరిమితం చేయడంతో భక్తులు దేవతలను వీక్షించలేరు. దైతపతి వర్గం సేవకుల ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ సేవ నిర్వహించారు.
రాయగడ: స్థానిక సాయిప్రియ నగర్లో గల ఎస్బీఐ రీజనల్ (కమర్షియల్) శాఖ మాతృశక్తి సీనియర్ సిటిజన్ గృహానికి జనరేటర్ను వితరణ చేసింది. సోమవారం శాఖ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలొ ఎస్బీఐ బ్రహ్మపురం జోన్ డిప్యూటీ జనరల్ మేనేజరు అలొక్ కుమార్ సిన్హా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 15 కేవీఏ సామర్థ్యం గల జనరేటర్కు ప్రత్యేక పూజలను నిర్వహించి గృహ నిర్వాహకులకు అందజేశారు. ఎస్బీఐ చేపడుతున్న సేవా కార్యక్రమంలో భాగంగా మాతృశక్తి సీనియర్ సిటిజన్ గృహానికి అవసరమయ్యే విద్యుత్ సరఫరా జనరేటర్ను వితరణ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సాయిప్రియ ఎస్బీఐ రీజనల్ శాఖ కార్యాల యం మేనేజరు ఉత్తర్ కుమార్ పటేల్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
సత్తాచాటిన గోకర్నపల్లి యువకుడు
● ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపిక
పొందూరు: మండలంలోని గోకర్నపల్లి గ్రామానికి చెందిన గురుగుబెల్లి రవికుమార్ ఒకేసారి మూడు బ్యాంకు ఉద్యోగాలకు ఎంపికై సత్తాచాటాడు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, గ్రామీణ బ్యాంక్ ఆఫ్ తెలంగాణాల్లో పీవో ఉద్యోగానికి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ తెలంగాణలో క్లర్క్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. దీంతో తల్లిదండ్రులు జి.సత్యనారాయణ, రాధ ఆనందం వ్యక్తం చేశారు. యువకుడికి ఎంపీపీ కిల్లి ఉషారాణి, మాజీ ఎంపీటీసీ సీపాన శ్రీరంగనాయకులు, కిల్లి నాగేశ్వరరావు, విశ్రాంత జూనియర్ లెక్చరర్ జి.అప్పలనాయుడులు అభినందనలు తెలిపారు.
ఎస్పీ గ్రీవెన్సుకు 47 వినతులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదు ల స్వీకరణ మరియు పరిష్కార వేదిక కార్యక్రమానికి (గ్రీవెన్సుకు) బాధితుల నుంచి 47 వినతులు అందాయి. అదనపు ఎస్పీ కేవీ రమ ణ వినతులు స్వీకరించి, సకాలంలో న్యాయం చేస్తామని బాధితులకు భరోసా ఇచ్చారు.


