
సత్వర సహాయానికి హామీ: సీఎం
భువనేశ్వర్: ప్రజా ఫిర్యాదులపై ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి సత్వర స్పందనకు చర్యలు చేపడుతున్నారు. స్థానిక యూనిట్–2 ప్రజాభియోగాల కేంద్రంలో సోమవారం జరిగిన 13వ ప్రజా ఫిర్యాదుల విచారణ పురస్కరించుకుని పీడిత వర్గంతో ముఖాముఖి చర్చించి ఫిర్యాదుల్ని స్వీకరించారు. ఈ విచారణ కార్యక్రమంలో తొమ్మిది మంది క్యాబినెట్ మంత్రులు, అదనపు ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. శిబిరానికి హాజరైన క్లిష్టమైన రోగులకు అక్కడికక్కడే తక్షణ వైద్య సహాయం అందించారు. 12వ విడత వరకు అందిన ఫిర్యాదులలో 91 శాతం ఫిర్యాదుల్ని పరిష్కరించారు. దాఖలైన 11,516 ఫిర్యాదుల్లో 10,502 ఫిర్యాదుల్ని పరిష్కరించినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం సింగిల్ విండో సిస్టమ్ ద్వారా 51 మందికి రూ. 55 లక్షలు సాయం అందజేశారు.
బాలికపై లైంగికదాడి కేసులో నిందితుడు అరెస్టు
మల్కన్గిరి : బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడిని మల్కన్గిరి జిల్లా బలిమెల పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. లిఫ్ట్ ఇస్తానని పిలిచి అఘాయిత్యానికి పాల్పడిన 45 ఏళ్ల దయమాడిని అరెస్టు చేసి ఎస్పీ రస్మీ రంజన్ అసేనపతి ఎదుట హాజరుపరిచారు.
శ్రీనివాసరావుకు పురస్కారం ప్రదానం
జయపురం: జయపురం వర్ధమాన కవి, పాత్రికేయులు సింహాద్రి శ్రీనివాసరావుకు శ్రీశ్రీ కళావేదిక పురస్కారం వరించింది. ఈ నెల 27వ తేదీన విశాఖపట్నంలో జరిగిన శ్రీశ్రీ కళావేదిక 150వ జాతీయ కవితా సమ్మేళనంలో శ్రీనివాసరావును ‘కవితా పురస్కారం’తో ఘనంగా సన్మానించారు.
మెగా రక్తదాన శిబిరం
రాయగడ: గుణుపూర్లోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (జీఐఈటీ ) విశ్వవిద్యాలయంలో సోమవారం మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 107 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. హైదరాబాద్లోని ఎండర్మైన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (హెచ్ఆర్) ఉపాధ్యక్షులు ఎ.వేంకటేశ్వరులు, విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్.వి.జె.రావు, మధు బడలమణి తదితరులు శిబిరంలో పాల్గొన్నారు. విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గుణుపూర్లోని బ్లడ్ బ్యాంక్ అధికారి డాక్టర లక్ష్మణ్ పాత్రో, టెక్నీషియన్ చంద్ర శేఖర్ పాత్రో, రాకేష్ కుమార్ పండ, నర్సింగ్ విభాగం అధికారి సుభస్మిత చౌదరి సహకరించారు.
విధి నిర్వహణలో అంకితభావానికి సత్కారం
భువనేశ్వర్: రాత్రింబవళ్లు నిరవధికంగా పరుగులు తీసే రైళ్లు సురక్షితంగా గమ్యం చేరడలంలో పట్టాల పటిష్టత అత్యంత కీలకం. పట్టాల నిర్వహణ, పర్యవేక్షణ నిరంతర ప్రక్రియ. ఈ కార్యకలాపాల్లో అంకితభావంతో సమయ స్ఫూర్తి ప్రదర్శించి విపత్కర పరిస్థితుల్ని నివారించిన క్షేత్ర స్థాయి సిబ్బందికి తూర్పు కోస్తా రైల్వే జనరల్ మేనేజర్ పరమేశ్వర్ ఫంక్వాల్ నలుగురు రైల్వే ఉద్యోగులను ప్రత్యేకంగా సత్కరించారు. దబ్పాల్లో ట్రాక్ మెయింటెయినర్ – 4 బీరేంద్ర ప్రసాద్ గోరైన్, కుంహర్ సోద్రాలో ట్రాక్ మెయింటెయినర్ – 4 రోహిత్ కుమార్, జఖాపురాలో ట్రాఫిక్ పాయింట్స్మన్ అభిమన్యు దొలై, జరపడాలో ట్రాక్ మెయింటెయినర్ – 1 గౌతమ్ మాఝి జనరల్ మేనేజరు ప్రత్యేక సత్కారం పొందిన వారిలో ఉన్నారు.

సత్వర సహాయానికి హామీ: సీఎం

సత్వర సహాయానికి హామీ: సీఎం