భువనేశ్వర్: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన పురస్కరించుకుని అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలో భాగంగా కాంగ్రెసు యువజన, విద్యార్థి వర్గాల నాయకుల్ని అరెస్టు చేసి ఠాణాలో నిర్బంధించారు. ఈ చర్యకు నిరసనగా ఒడిశా ప్రదేశ్ కాంగ్రెసు కమిటి ప్రముఖులు శుక్ర వారం శాంతియుతంగా ధర్నా నిర్వహించారు. పోలీసు చర్యల్ని తీవ్రంగా ఖండించారు. పీసీసీ అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన శాంతియుత నిరాహార దీక్షలో, ప్రదేశ్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, స్టూడెంట్ కాంగ్రెస్, పీసీసీ కార్యకర్తలు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిరవధికంగా నిరాహార దీక్ష చేశారు. భారత ప్రధాన మంత్రి గంజాం జిల్లా గోపాల్పూర్ గ్యాంగ్రేప్ స్థలాన్ని సందర్శించి భవిష్యత్లో ఇటువంటి సంఘటన పునరావృతం కాదని రాష్ట్ర ప్రజలకు హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. జాజ్పూర్ జిల్లాను సందర్శించి కలరా ప్రభావిత ప్రాంతం పరిస్థితిని ప్రధాన మంత్రి ప్రత్యక్షంగా సమీక్షించి ప్రభుత్వ వైఫల్యాన్ని సరిదిద్దే చర్యగా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రికి నిర్దిష్ట సూచనలు జారీ చేయాలని కాంగ్రెసు ప్రముఖులు కోరారు. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటనకు ముందు పోలీసులు మాజీ విద్యార్థి కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, భువనేశ్వర్ పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు యాసిర్ నవాజ్, ఇతర యువజన కాంగ్రెస్ నాయకులను అదుపులోకి తీసుకుని గురువారం రాత్రి స్థానిక రాజధాని పోలీస్ ఠాణాలో నిర్బంధించారు.
రాత్రికి రాత్రి కాంగ్రెస్ కార్యకర్తలు అరెస్టు