
లక్ష్య సాధనకు విద్య కీలక మాధ్యమం: గవర్నరు
భువనేశ్వర్: యువత జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని కలల్ని సాకారం చేసుకునేందుకు విద్య అత్యంత శక్తివంతమైన మాధ్యమంగా రాష్ట్ర గవర్నర్ డాక్టర్ హరి బాబు కంభంపాటి పేర్కొన్నారు. విద్య వ్యక్తిగతంగా శక్తివంతం చేయడమే కాకుండా సమగ్ర సమాజ అభ్యున్నతికి దోహదపడుతుందని గిరిజన విద్యార్థుల్ని ఆయన ప్రోత్సహించారు. గిరిజనుల హక్కులు, వారి సంక్షేమం కోసం ఉద్దేశించిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలను విద్యార్థులు అర్థం చేసుకుని అవగాహన వ్యాప్తి చేయడం ద్వారా సమాజంలోని ఇతరులు ఈ పథకాల నుంచి ప్రయోజనం పొందగలుగుతారు. గిరిజన విద్యార్థులు ఈ దిశలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. అవగాహన సందర్శన పర్యటనలో భాగంగా గిరిజన విద్యార్థుల బృందం స్థానిక రాజ్ భవన్ సందర్శించింది. ఈ సందర్భంగా రాజ్ భవన్పాత అభిషేక్ హాల్లో గవర్నరు వారితో సంభాషించారు. పర్యటన పురస్కరించుకుని విద్యార్థుల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. 14 జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో చదువుతున్న ప్లస్ టూ, ప్లస్ త్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయిలకు చెందిన 72 మంది గిరిజన విద్యార్థులు రాజ్ భవన్ను సందర్శించారు. ఈ బృందంతో గవర్నర్ ముఖాముఖి సంభాషించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ తెగల కోసం ఉద్దేశించిన వివిధ సంక్షేమ పథకాల గురించి గిరిజన విద్యార్థులు క్షుణ్ణంగా తెలుసుకుని వారి వర్గాలలో ఈ కార్యక్రమాల గురించి అవగాహన కల్పించాలని రాష్ట్ర గవర్నర్ ఈ సందర్భంగా కోరారు. విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో షెడ్యూల్డ్ తెగలకు అందుబాటులో ఉన్న రిజర్వేషన్ శాతం గురించి విద్యార్థులకు తెలుసా అని కూడా ఆయన అడిగి తెలుసుకున్నారు, ఈ అవకాశాలను ఉపయోగించుకోవడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

లక్ష్య సాధనకు విద్య కీలక మాధ్యమం: గవర్నరు