ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను  | Narendra Modi will not rest, Modi will not sleep peacefully | Sakshi
Sakshi News home page

ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేను 

Jun 21 2025 1:44 AM | Updated on Jun 21 2025 1:44 AM

Narendra Modi will not rest, Modi will not sleep peacefully

రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నా  

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ నా హృదయంలో ఉన్నాడు 

ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం ఇష్టం  

ప్రధాని మోదీ స్పషీ్టకరణ   

బిహార్, ఒడిశాలో ప్రధానమంత్రి పర్యటన  

సివాన్‌: నిత్యం ప్రజాసేవ చేయకపోతే ప్రశాంతంగా నిద్రించలేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. రాత్రి పగలు ప్రజల కోసమే పని చేస్తున్నానని చెప్పారు. ఆయన శుక్రవారం బిహార్, ఓడిశాలో పర్యటించారు. తొలుత బిహార్‌లోని సివాన్‌ జిల్లాలో రూ.5,900 కోట్లకుపైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. బిహార్‌లోని పాటలీపుత్ర జంక్షన్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌ వరకు నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్‌(ఆర్జేడీ), కాంగ్రెస్‌లపై విరుచుకుపడ్డారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ను ఆర్జేడీ అవమానించిందని ఆరోపించారు. వారసత్వ రాజకీయాలను అంబేడ్కర్‌ వ్యతిరేకించారని గుర్తుచేశారు. అందుకే అంబేడ్కర్‌ అంటే ఆర్జేడీ, దాని మిత్రపక్షాలకు ఇష్టం లేదన్నారు. 

బాబాసాహెబ్‌ చిత్రపటాన్ని ఆర్జేడీ నేతలు పాదాలతో తొక్కేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ప్రజలు డిమాండ్‌ చేస్తే ఏమాత్రం స్పందించలేదని మండిపడ్డారు. అంబేడ్కర్‌ కంటే తామే గొప్పవాళ్లమని ఆర్జేడీ–కాంగ్రెస్‌ నాయకులు అహంకారం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అంబేడ్కర్‌ తన హృదయంలో ఉన్నాడని, ఆయన చిత్రపటాన్ని గుండెకు హత్తుకోవడం తనకు ఇష్టమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు కొల్లగొట్టడానికి ఆర్జేడీ, కాంగ్రెస్‌ కాచుకొని కూర్చున్నాయని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కూటమిని చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

అభివృద్ధి కోసం శ్రమిస్తున్నాం  
‘‘భారతదేశ ప్రగతిని చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. నిన్ననే విదేశాల నుంచి తిరిగొచ్చా. విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు అక్కడి నేతలు మన దేశ అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రశంసించారు. పేదల సాధికారతకు ఎదురవుతున్న అడ్డంకులను ఎన్డీయే ప్రభుత్వం తొలగిస్తోంది. గత 11 ఏళ్లుగా ప్రజాసేవలో నిమగ్నమయ్యాం. అభివృద్ధి కోసం అహోరాత్రులూ శ్రమిస్తున్నాం. బిహార్‌లో మళ్లీ జంగిల్‌రాజ్‌ రావొద్దంటే విపక్ష ఇండియా కూటమి ఓడించాలి. ఎన్డీయే నినాదం సబ్‌కా సాత్, సబ్‌కా విశ్వాస్‌. విపక్ష కూటమి నినాదం పరివార్‌కా సాత్, పరివార్‌కా వికాస్‌. సొంత కుటుంబాల అభివృద్ధి తప్ప ప్రజలంటే వారికి లెక్కలేదు. అంబేడ్కర్‌ రాసిన రాజ్యాంగ స్ఫూర్తికి ఇది విరుద్ధం కాదా?’’ అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. 

భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర  
ప్రధాని మోదీ ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో తిరంగా యాత్ర, రోడ్‌షోలో  పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు నుంచి జనతా మైదాన్‌ వరకు 9 కిలోమీటర్ల మేర జరిగిన ఈ యాత్రలో వేలాది మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం పూర్తయిన సందర్భంగా తిరంగా యాత్ర నిర్వహించారు. రూ.18,600 కోట్లకుపైగా విలువైన 105 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించారు.  

ట్రంప్‌ ఆహ్వానం తిరస్కరించా.. 
వాషింగ్టన్‌లో పర్యటించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆహ్వానించగా, తాను తిరస్కరించానని ప్రధాని మోదీ చెప్పారు. వాషింగ్టన్‌ పర్యటనకు బదులు ఒడిశాను ఎంచుకున్నానని తెలిపారు. భువనేశ్వర్‌ సభలో ఆయన మాట్లాడారు. ‘‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్‌ నాతో ఫోన్‌లో మాట్లాడారు. వాషింగ్టన్‌కు రావాలంటూ ఆహ్వానించారు. చర్చించుకుందామని, కలిసి భోజనం చేద్దామని అన్నారు. ఆహ్వానించినందుకు ట్రంప్‌కు కృతజ్ఞతలు తెలియజేశా. జగన్నాథుడు కొలువుదీరిన ఒడిశాకు వెళ్లాల్సి ఉందని చెప్పా. వాషింగ్టన్‌కు రాలేనంటూ ట్రంప్‌ ఆహ్వానాన్ని తిరస్కరించా’’ అని ప్రధానమంత్రి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement