
ఎన్నికల హామీలు ఏమయ్యాయి..?
పర్లాకిమిడి: ఏడాది పాలన పూర్తి చేసుకున్నామని వికాస్ ఉత్సవాలు చేసుకుంటున్న బీజేపీ రాష్ట్రంలోని ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని డీసీసీ అధ్యక్షుడు, మోహనా ఎమ్మెల్యే దాశరథి గొమాంగో అన్నారు. స్థానిక తెలుగు సొండివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని చిట్ఫండ్ నేరస్తులను అరెస్టు చేస్తామని చెప్పిన ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్ల కేంద్రాల్లో గత ప్రభుత్వం 5 నుంచి 6 కిలోలు ధాన్యం కోత విధిస్తుండగా, ఈ ప్రభుత్వం వచ్చాక 8 నుంచి 9 కిలోల వెయిటేజ్ కోత విధిస్తున్నారని మండిపడ్డారు. మహిళలకు అందిస్తున్న సుభద్ర పథకం కింద రూ.50 వేల వోచర్లు ఇస్తామని చెప్పి, రూ.10 వేలు అకౌంట్లో వేసి అన్ని జిల్లాల్లో వికాస్ మేళా నిర్వహిస్తున్నారని ఎద్దేవా చేశారు. పశ్చిమ ఒడిశాలో సమగ్ర ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణం చేసి 51 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేకపోయారని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు 300 యూనిట్ల వరకూ ఉచితంగా కరెంటు అందిస్తామని హామీ ఇచ్చారు కానీ, అది ఇంతవరకూ అమలు కాలేదని దుయ్యబట్టారు. ఒడిశా పీసీసీ అధ్యక్షుడు భక్తచరణ్ దాస్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ తరపున పోరాడతామని తెలియజేశారు. ఆయనతో పాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు బసంత పండా, అభిమన్యు పండా (మాజీ కౌన్సిలర్), మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాస్మిన్ షేక్, రంజితా పాణి, పురపాలక సంఘం మాజీ వైస్ చైర్మన్ సంజయ్ అధికారి, సంగ్రాం సాహు, బిష్ణుదాస్ తదితరులు పాల్గొన్నారు.