పకడ్బందీగా రథయాత్ర | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా రథయాత్ర

Jun 17 2025 6:49 AM | Updated on Jun 17 2025 6:49 AM

పకడ్బందీగా రథయాత్ర

పకడ్బందీగా రథయాత్ర

● భద్రతా ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

భువనేశ్వర్‌:

నెల 27న జరగనున్న ప్రఖ్యాత పూరీ రథయాత్ర ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పకడ్బందీగా పూర్తి చేయాలని రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ యోగేష్‌ బహదూర్‌ ఖురానియా పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పోలీసు ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. యాత్ర సన్నాహాలు పురస్కరించుకుని సీనియర్‌ పోలీసు అధికారులు అనుక్షణం చురుగ్గా, అప్రమత్తంగా ఉండాలని డీజీపీ ఆదేశించారు. శ్రీ జగన్నాథుని నవ యౌవన దర్శనం, రథ యాత్ర, బహుడా (మారు) యాత్ర, స్వర్ణ అలంకరణ వంటి ప్రముఖ ఉత్సవాలు పురస్కరించుకుని దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు పూరీకి రానుందని భద్రతా ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. ఈ క్రమంలో నేరాల నియంత్రించడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని అన్ని పోలీస్‌ స్టేషన్లలో ప్రత్యేక డ్రైవ్‌లను ప్రారంభించాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా హోటళ్లు, లాడ్జీలు, మఠాలు, దేవాలయాలు, బస్‌ స్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, కార్మికుల వసతి గహాలు, ధర్మశాలల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని సూచించారు. మొదటిసారిగా, పట్టణ పోలీస్‌ స్టేషన్‌ లో సమన్వయ నియంత్రణ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనితో పాటు పూరీ పట్టణంలో వివిధ ప్రాంతాలలో కత్రిమ మేధస్సు (ఏఐ) కెమెరాలను ఏర్పాటు చేయాలని డీజీపీ ఆదేశించారు. ఉత్తర ఛక్‌, పూరీ, పూరీ – కోణార్క్‌ రోడ్‌ మరియు నగరంలోని వివిధ ప్రధాన కూడళ్లలో ఏఐ కెమెరాల ఏర్పాటుపై చర్చించారు. భక్తుల సౌకర్యం కోసం ట్రాఫిక్‌ నిర్వహణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు.

మొబైల్‌ యాప్‌..

ప్రజా రవాణా సౌలభ్యం కోసం ఒక ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అభివృద్ధి చేశామని, ఇది ట్రాఫిక్‌ సలహా, పార్కింగ్‌ స్థలాలు, ట్రాఫిక్‌ జామ్‌లు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి తక్షణ సమాచారాన్ని అందిస్తుందని డీజీపీ వివరించారు.

ఉగ్రవాద ముప్పు..

ఉగ్రవాద దాడుల ముప్పు పొంచి ఉందనే సమాచారం అందుతున్న పరిస్థితుల్లో ఆకస్మిక విపత్తును సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి యంత్రాంగం సిద్ధం చేశామని డీజీపీ తెలిపారు. సముద్రంలో భారత నావికాదళం, ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌, ఒడిశా పోలీస్‌ మారిటైమ్‌ స్టేషన్‌ వర్గాలు ఉమ్మడి పహరా వ్యవస్థ పని చేస్తుందన్నారు.

ట్రాఫిక్‌ నిర్వహణకు ప్రాధాన్యత..

నగరంలో ట్రాఫిక్‌ నిర్వహణ కోసం రోడ్‌ డివైడర్‌, డిలినేటర్‌, ట్రాఫిక్‌ జోన్‌ వ్యవస్థ, నగరంలోని వివిధ ప్రదేశాలలో తగినంత పార్కింగ్‌ వ్యవస్థ, క్రమబద్ధమైన ట్రాఫిక్‌ వ్యవస్థ నిర్వహణ తదితర సమావేశంలో చర్చించారు.

ముఖ్యులపై దృష్టి

జగన్నాథుని రథ యాత్రకు గవర్నర్‌, ముఖ్యమంత్రి వంటి ప్రముఖులు రానున్నందున ప్రత్యేక హెలిప్యాడ్‌, పోలీసు బలగాల వసతి కోసం ప్రత్యేక సౌకర్యాలు, వాహనాలు, బారికేడ్‌ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్లు డీజీపీ ప్రకటించారు. సమావేశంలో డైరెక్టర్‌ (ఇంటెలిజెన్స్‌) ఆర్‌.పి.కోచే, అదనపు పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌(ఆధునికీకరణ) సౌమేంద్ర కుమార్‌ ప్రియదర్శి, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (శాంతి భద్రతలు) సంజయ్‌ కుమార్‌, రవాణా కమిషనర్‌ అమితాబ్‌ ఠాకూర్‌, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (కమ్యూనికేషన్‌) దయాళ్‌ గంగ్వార్‌, అదనపు పోలీసు డైరెక్టర్‌ జనరల్‌ (ఎస్‌ఏపీ) రాజేష్‌ కుమార్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (సెంట్రల్‌ రీజియన్‌) ఎస్‌.ప్రవీణ్‌ కుమార్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (ఆపరేషన్స్‌) డాక్టర్‌ దీపక్‌ కుమార్‌, ఇనస్పెక్టర్‌ జనరల్‌ (బీపీఎస్‌ పీఏ) అనుప్‌ సాహు, డీఐజీ (ప్రొవిజనింగ్‌) చరణ్‌ సింగ్‌ మీనా, డీఐజీ (ఎస్‌ఐడబ్ల్యూ) డాక్టర్‌ కన్వర్‌ హబీబ్‌ సింగ్‌, డీఐజీ (ఎస్‌ టీఎఫ్‌) పినాక్‌ మిశ్రా, డీఐజీ (క్రైమ్‌ బ్రాంచ్‌) బి.గంగాధర్‌, డీఐఏజీ (పర్సనల్‌) కిషోర్‌ బానోత్‌, రైల్వే పోలీసు సూపరింటెండెంట్‌ వివేకానంద్‌ శర్మ, పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ వినీత్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement