కొరాపుట్: ఒడిశా రాష్ట్ర పరిస్థితులను రాహుల్ గాంధీకి కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క వివరించారు. శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రాహుల్తో ఉల్క భేటీ అయ్యారు. ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపడంలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిందన్నారు. గత 25 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ క్యాడర్ భారీస్థాయిలో విరుచుకుపడడంపై బీజేపీ ప్రభుత్వం వణుకు పుట్టించిందన్నారు. మహిళలపై అత్యాచారాలు, అసెంబ్లీలో కాంగ్రెస్ పోరాటం, అసెంబ్లీ ముట్టడి, నెత్తురు చిందించిన కాంగ్రెస్ కార్యకర్తల పోరాటం వివరించారు.
విజిలెన్స్ వలలో అంగన్వాడీ సూపర్ వైజర్
కొరాపుట్: విజిలెన్స్ వలకు అంగన్వాడీ సూపర్ వైజర్ చిక్కారు. శుక్రవారం కొరాపుట్ విజిలెన్స్ విభాగం ఈ వివరాలు ప్రకటించింది. జిల్లాలోని లక్ష్మీపూర్ సమితి బూర్జ గ్రామంలో అంగన్ వాడీ సూపర్ వైజర్ రేణుక పట్నాయిక్ రు.50 వేలు లంచం తీసుకుంటుండగా అధికారులు పట్టుకున్నారు. తన పరిధిలో పని చేస్తున్న అంగన్ వాడీ వర్కర్ డబ్బులు డిమాండ్ చేశారు. దాంతో అంగన్వాడీ వర్కర్ విజిలెన్స్ విభాగాన్ని సంప్రదించి పట్టించారు. అనంతరం అరెస్ట్ చేసి జైలుకి తరలించారు.
కాశీనగర్ రైల్వేట్రాక్ వద్ద మృతదేహం
పర్లాకిమిడి: కాశీనగర్ రైల్వేట్రాక్ వద్ద శుక్రవారం ఉదయం ఒకరు రైలు కింద పడి మృతి చెందినట్టు రైల్వే పోలీసు అధికారులు తెలియజేశారు. మృతుడు కాశీనగర్ సమితి ఖండవ పంచాయతీలో పురుటిగుడ గ్రామానికి చెందిన మోహన రావు (40)గా పోలీసులు గుర్తించారు. శుక్రవారం వేకువజామున గుణుపురం నుంచి పూరీ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలుబండి కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసుల సమాచారం. కాశీనగర్లో శివ మోటారు గ్యారేజి బావమరిది అయిన మోహనరావుకు భార్య ముగ్గురు సంతానం ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు వారి బంధువులు చెబుతున్నారు. రైల్వే పోలీసులు కేసును యూడీ కింద నమోదు చేసుకుని పోస్టుమార్టం కోసం పర్లాకిమిడి ప్రభుత్వ మెడికల్కు తరలించారు.
బ్యాంకు ఉద్యోగి
అనుమానాస్పద మృతి
పర్లాకిమిడి: గజపతి జిలా మోహన బ్లాక్ చంద్రగిరిలో ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగి తన నివాస గృహంలో అనుమానాస్పదంగా మృతిచెందినట్టు చంద్రగిరి పోలీసులు శుక్రవారం గుర్తించారు. మృతుడు భువనేశ్వర్కు చెందిన ప్రకాష్ కుమార్ మహారాణా (33)గా పోలీసులు గుర్తించారు. ఆయన బ్యాంకుకు శుక్రవారం విధులకు రాకపోవడంతో తోటి ఉద్యోగులు బ్యాంకు మేనేజరుకు ఫిర్యాదు చేశారు. అయితే ఆయన నివాస గృహానికి వెళ్లి ఫోన్ చేసినా రాకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాష్ కుమార్ మహారాణా తన గదిలో ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫిబ్రవరి మాసంలో ప్రకాష్ కుమార్ చంద్రగిరి బ్యాంకులో జాయిన్ అయ్యాడు. మృతుని బంధువులకు పోలీసులు సమాచారం అందజేసి, శవాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. కేసును చంద్రగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రాహుల్ గాంధీతో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క భేటీ
రాహుల్ గాంధీతో కొరాపుట్ ఎంపీ సప్తగిరి ఉల్క భేటీ


