మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): అంతర్జాతీయ వారసత్వ దినోత్సవం సందర్భంగా ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం ఆవరణలో శనివారం రాత్రి హెరిటేజ్ హార్మనీ పేరుతో నిర్వహించిన మ్యూజికల్ నైట్ ఉర్రూతలూగిం చింది. గాయకులు ఎస్పీ శ్రీచరణ్, సునీత కలిసి ‘ఓంకార నాదాను సంధానమౌ గానమే శంకరాభరణము.. పాటతో సంగీత విభావరిని ప్రారంభించారు. వారితోపాటు సాహితి, అరుణ్ కౌండిన్య పలు పాటలను ఆలపించి అలరించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రారంభ సభలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ మాట్లాడుతూ.. చారిత్రక సంపదను కాపాడి భావి తరాలకు అందించాల్సి అవసరం ఉందన్నారు. జిల్లాలో చారిత్రక సంపద గురించి నేటి తరానికి వివరించాలన్నారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు, ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ సృజనాత్మకత కమిషన్ చైర్పర్సన్ తేజస్విని, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి పాల్గొన్నారు. సభ అనంతరం వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి లివింగ్ హెరిటేజ్ అవార్డులు అందజేసి సత్కరించారు. 101 ఏళ్ల లక్ష్మయ్య, తెలుగు ఉపాధ్యాయుడు మెట్ట వెంకటేశ్వరరావు, డాక్టర్ సమరం, కార్పొరేషన్లో స్వీపర్గా విధులు నిర్వహిస్తున్న రమణ, ప్రమాద రహితంగా విధులు నిర్వహించిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ జి.మోహన్రావు, చెస్ క్రీడాకారిణి కోనేరు హంపి, ఆర్చరీ క్రీడాకారుడు బొమ్మదేవర ధీరజ్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సూర్య చరిష్మ, 68 సార్లు రక్తదానం చేసిన ఎ.వి. సుధాకర్, యోగా ట్రైనర్ శీరీష, 50 ఏళ్లుగా పౌరోహిత్యం నిర్వహిస్తున్న వీరుపాక్ష సమస్యం తదితరులను కలెక్టర్ సత్కరించారు. సభ అనంతరం జరిగిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి.


