చాలా ఆనందంగా ఉంది..
కళా వైభవం..
నేటి నుంచి కొండపల్లి బొమ్మల పండుగ
కొండపల్లి(ఇబ్రహీంపట్నం): మన దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన కొండపల్లి బొమ్మల పరిశ్రమ సుమారు 500 ఏళ్లకు పైగా విరాజిల్లుతోంది. అలాంటి కళా వైభవాన్ని భావితరాలకు అందించాలని కొండపల్లి బొమ్మల పండుగ వేడుకలు నిర్వహించేందుకు జిల్లా పర్యాటక శాఖ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. అంతర్జాతీయ వారసత్వ దినోత్సవాన్ని పుస్కరించుకొని శనివారం నుంచి 20వరకు వేడుకలకు ఏర్పాట్లు చేసింది. కలెక్టర్ లక్ష్మీశ ప్రత్యేక శ్రద్ధతో నిర్వహిస్తున్న బొమ్మల మేళా కళాకారులకు చేయూతనిస్తోందనే ఆశాభవం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి బొమ్మల వేడుకలు విజయవంతం చేయాలని ఆదేశించారు. కొండపల్లికి పేరుప్రఖ్యాతులు తీసుకొచ్చే బొమ్మల వేడుకలను బొమ్మల తయారీ కళాకారులతో పాటు ప్రతి ఇంట్లో నిర్వహించుకోవాలని కలెక్టర్ సూచించారు.
కొండపల్లి బొమ్మ.. తరతరాల జ్ఞాపకం..
కొండపల్లి ఖిల్లా కోటను రెడ్డిరాజుల వంశానికి చెందిన ప్రోలాయ వేమారెడ్డి 14వ శతాబ్దంలో నిర్మించే సమయంలో భవనాలపై చూడముచ్చటైన డిజైన్లు అద్దేందుకు రాజస్థాన్కు చెందిన రాజవంశీకులు ఇక్కడకు వలస వచ్చారు. రాజభవనాలపై డిజైన్(నగిషీలు)లు వేస్తూ రాజులు ఇచ్చే భరణాలతో జీవితాలు గడిపేవారు. కొందరు ఆ సమయంలోనే బొమ్మల తయారీ పరిశ్రమ కొండ కింద కొండపల్లిలో ఏర్పాటు చేసుకున్నారు. అనంతరం బ్రిటీష్ వారి పాలనలో బొమ్మల తయారీ పరిశ్రమను విస్తరించుకుని వారి జీవనభృతిని ఏర్పాటు చేసుకున్నారు. కొండపల్లి పరిధిలోని చుట్టుపక్కల అడవుల్లో లభించే తేలికపాటి తెల్లపొనికి చెక్కతో ఆకర్షణీయమైన బొమ్మలు ఇక్కడ తయారు చేసేవారు. రాజస్థాన్ కళాకారుల నుంచి ఈ ప్రాంతానికి చెందిన వారు సైతం బొమ్మల తయారీలో నైపుణ్యం సాధించారు. ప్రస్తుతం సుమారు 150 కుటుంబాల వారు బొమ్మల పరిశ్రమపై ఆధారపడి బతుకుతున్నారు.
అట్టహాసంగా ఏర్పాట్లు..
బహుమతుల ప్రదానం..
కొండపల్లి బొమ్మల తయారీలో కళాకారుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఫిబ్రవరి 3నుంచి మార్చి 8 వరకు నిర్వహించిన బొమ్మల పోటీల్లో కళాకారులు తమ నైపుణ్యంతో తయారు చేసిన బొమ్మలను ఎక్స్పీరియన్స్ సెంటర్కు చేర్చారు. వేడుకలు ముగింపు రోజున న్యాయ నిర్ణేతల ప్రకటించిన విజేతలకు రూ.లక్ష విలువైన బహుమతులు, ప్రశంసాపత్రాలు అందించనున్నారు.
సుమారు 500 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండపల్లి బొమ్మల కోసం వేడుక ఈ ఏడాది జరగడం కళాకారుల్లో ఆనందాన్ని నింపుతోంది. ఈ వేడుకలతో రెట్టింపు ఉత్సాహంతో కళాకారులు పరిశ్రమను ముందుకు తీసుకెళ్తారు. సుమారు 20ఏళ్లుగా నా కుటుంబం అత్యంత నైపుణ్యంతో బొమ్మల తయారీ పరిశ్రమ నడుపుతున్నాం. అనేక అవార్డులు కూడా వరించాయి.
– కూరెళ్ల వెంకటాచారి,
బొమ్మల కళాకారుడు, కొండపల్లి


