ఈగల్ ఐజీపీ రవికృష్ణ
పెనమలూరు: రాష్ట్రంలో యువతీ యువకులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని ఈగల్ ఐజీపీ ఆకే రవికృష్ణ అన్నారు. కానూరు సిద్ధార్థ డీమ్డ్ టుబీ యూనివర్సిటీలో బుధవారం విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ, ఈగల్ ఆధ్వర్యంలో దండి మార్చ్ 2.0 డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ మిషన్ కార్యక్రమం నిర్వహించారు. తిరుపతి నుంచి విశాఖపట్నం వరకు 1000 కిలోమీటర్ల సైకిల్ ర్యాలీ ఇక్కడకు వచ్చిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఐజీపీ ఆకే రవికృష్ణ మాట్లాడుతూ మహాత్మాగాంధీ, అబ్దుల్ కలాం స్ఫూర్తితో ప్రత్యేక కార్యాచరణ చేపట్టామన్నారు. ఈగల్ మిషన్ ద్వారా విద్యార్థులందరినీ కలిసి ఎన్డీపీ చట్టంపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. మాదకద్రవ్యాల వల్ల భవిష్యత్తు అంధకారంగా మారుతుందని వివరించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే మాదకద్రవ్యాలను పట్టుకోవటానికి రైళ్లు, బస్సులు, కార్లపై నిఘా ఉంచి తనిఖీలు చేస్తున్నామన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్తో విద్యా సంస్థల పరిసర ప్రాంతాల్లో పొగాకు, సిగరెట్లు విక్రయాలు నిషేధించామని తెలిపారు.
22 నాటికి ముగిస్తాం..
విబ్రెంట్స్ ఆఫ్ కలాం సంస్థ ఫౌండర్ విజయ్కలాం మాట్లాడుతూ ఏప్రిల్ 6వ తేదీ నుంచి తిరుపతి వేంకటేశ్వర యూనివర్సీటీ నుంచి విశాఖపట్నంలో ఈ నెల 22వ తేదీ నాటికి ముగిస్తామన్నారు. కార్యక్రమంలో ఈగల్ ఎస్పీ కె.నాగేష్బాబు, అదనపు ఎస్పీ ప్రభాకర్, డీఎస్పీ ధర్మేంద్ర, సిద్ధార్థ వర్సిటీ ఉపకులపతి డాక్టర్ వెంకటేశ్వరరావు, ప్రో ఉపకులపతి డాక్టర్ ఏవీ రత్నప్రసాద్, రిజిస్ట్రార్ డాక్టర్ ఎం.రవిచంద్, ఎన్ఎస్ఎస్ కోర్డినేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


