అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు | Telangana State Formation Day Celebrations In Abu Dhabi | Sakshi
Sakshi News home page

అబుదాబిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

Jun 1 2025 9:16 PM | Updated on Jun 1 2025 9:16 PM

Telangana State Formation Day Celebrations In Abu Dhabi

అబుదాబి  :తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అబు ధాబిలోని ఇండియా ఎంబసీ వేదికగా ఎంతో వైభవంగా నిర్వహించబడింది. తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ - అబుధాబి ఆధ్వర్యంలో జయప్రదంగా సాగిన ఈ వేడుక తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ వేడుకకు  ప్రేం చంద్, కాన్సులర్(కౌన్సిలర్) ముఖ్య అతిథిగా హాజరయ్యారు, గౌరవ అతిథులుగా కుమారి ఆయుషి సుతారియా, సెకండ్ సెక్రటరీ (పాలిటికల్) పాల్గొన్నారు. వీరి సమక్షంలో దీపప్రజ్వలన కార్యక్రమం నిర్వహించబడింది.తెలంగాణ పిల్లలు భారత మరియు యుఏఈ జాతీయ గీతాలు, తెలంగాణ రాష్ట్ర గీతం ఆలపించి దేశభక్తిని ప్రతిబింబించారు.  

అనంతరం తెలంగాణ బాలికలు  మరియు మహిళలు శాస్త్రీయ నృత్యాలు, జానపద నృత్యాలు, సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా వేడుకకు కొత్త అందాన్ని తెచ్చారు. తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ సహకారంతో, ధరావత్ రాజ్‌కుమార్ నేతృత్వంలో వచ్చిన ప్రతినిధి బృందం పేరిణి  శివ తాండవం, గుస్సాడి నృత్యం, పోతరాజు, మరియు ఇతర సంప్రదాయ నృత్యాలు ప్రదర్శించారు. ఈ కళారూపాలు, వేడుకలో తెలంగాణ సాంస్కృతిక సంపదను మధురంగా ప్రతిబింబించాయి.

ప్రత్యేకంగా, తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ సభ్యులు - పావని, అర్చనా, లక్ష్మి తమ కృషితో తెలంగాణ కళా సంపదను ప్రతిబింబించే చిత్ర ప్రదర్శన వేడుకలకు మరింత ఆకర్షణ గా నిలిచింది. ఎంబసీ ప్రాంగణం తెలంగాణను తలపించేలా అలంకరించబడింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇంతే కాదు, డప్పు కళాకారుల దరువు వేడుక లో మరింత ఉత్తేజం నింపింది. డప్పు కళాకారులు, పోతరాజు కళాకారులు, గుస్సాడీ కళాకారులు మరియు పేరిణి శివ తాండవం కళాకారులు కలిసి చేసిన జుగల్ బంది ప్రేక్షకులను ఎంత గానో అలరించింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్,  ఎంబసీ అధికారులను ప్రత్యేకంగా సన్మానించింది.  ఈ సంబరాలలో పాల్గొన్న ఇతర రాష్ట్రాల సంఘాల నాయకులను మరియు ఇతర సాంఘిక సేవ సంఘం నాయకులను శాలువా కప్పి మరియు మొమెంటో ప్రధానం చేసి సత్కరించారు.  అలాగే కార్యక్రమం లో పాల్గొన్న కళాకారులందరికి జ్ఞాపికలు ఇచ్చి సన్మానించారు.. ఈ వేడుక అబూదాబి లో నివసిస్తున్న తెలంగాణ ప్రజలకు చిరస్థాయిగా నిలిచిపోవలసిన జ్ఞాపకంగా మారింది అని అసోసియేషన్ కార్య నిర్వాహకుడు రాజా శ్రీనివాస రావు తెలియ జేశారు.

వేడుకల తదనంతరం కార్యక్రమానికి వచ్చిన అతిదులందరికి, కార్య క్రమ నిర్వాహకులు  తెలంగాణ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.  తెలంగాణ ప్రభుత్వం, సాంస్కృతిక శాఖ, మరియు భారత రాయబార కార్యాలయం అందించిన సహాయంతో ఈ వేడుక మరింత వైభవంగా జరిగింది. వేదికను అందుబాటులోకి తీసుకువచ్చిన ఎంబసీ అధికారులకు తెలంగాణ ఫ్రెండ్స్ అసోసియేషన్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement