సుభాష్నగర్: భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా మోపాల్ మండలం బైరాపూర్ గ్రామానికి చెందిన నేనావత్ ఓంసింగ్ నియమితులయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆదేశాల మేరకు ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రవి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. రిటైర్డ్ ఉద్యోగి అయిన ఓంసింగ్.. గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. తన నియామకానికి కృషి చేసిన ఎంపీ అర్వింద్ ధర్మపురి, ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్రెడ్డి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి, రాష్ట్ర కార్యదర్శి గోపిడి స్రవంతిరెడ్డి, పార్టీ జిల్లా, రాష్ట్ర నాయకత్వానికి ఓంసింగ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
రూరల్కే అధిక ప్రాధాన్యత..
బీజేపీ జిల్లా అధ్యక్షుడి సహా వివిధ మోర్చాల అధ్యక్షుల నియామకంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికే రాష్ట్ర నాయకత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా దినేష్ పటేల్ కులాచారితోపాటు యువ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పానుగంటి సతీష్రెడ్డి (డిచ్పల్లి), కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా పాట్కూరి తిరుపతిరెడ్డి (జక్రాన్పల్లి) ఇప్పటికే కొనసాగుతున్నారు. తాజాగా ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నేనావత్ ఓంసింగ్ (మోపాల్)ను నియమితులయ్యారు.


