● అసత్య ప్రచారాన్ని తిప్పికొడతా
● బాన్సువాడ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి
రుద్రూర్ : బాన్సువాడ నియోజకవర్గంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొడతానని బాన్సువాడ సెగ్మెంట్ కాంగ్రెస్ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, ఎస్ఐఆర్ అవగాహన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పార్టీ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న కార్యకర్తలకు న్యాయం జరిగేలా కృషి చేస్తానని తెలిపారు. నస్రుల్లాబాద్లో త్వరలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. పార్టీలోకి వచ్చిన వలస నేతలను చూసి ఎవరూ అధైర్యపడవద్దని, పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్తకు తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. సీనియర్ కార్యకర్తల సేవలను పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తానన్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపుతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అర్హులైన కార్యకర్తలకు పార్టీ బీ–ఫారాలు అందేలా ప్రయత్నిస్తానని తెలిపారు. అనంతరం ఎస్ఐఆర్ కార్యక్రమంపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. పార్టీకి సంబంధించిన ప్రతి ఓటు నమోదయ్యేలా బీఎల్ఏలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇందూర్ చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గంగాధర్ దేశాయ్, కిషోర్ యాదవ్, సతీష్, కొత్తకొండ భాస్కర్, మేక వీర్రాజు, వెంకటగౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్లు, నాయ కులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


