● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
డిచ్పల్లి(నిజామాబాద్రూరల్): రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తూ.. ప్రతి నియోజకవర్గానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)ను మంజూరు చేసిందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తెలిపారు. నియోజకవర్గానికి మంజూరైన టీపీఎస్ ఏర్పాటు విషయమై బుధవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో డీఈవో అశోక్తో ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆదర్శ పాఠశాలలను టీపీఎస్గా ఉన్నతీకరించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం(బీ) గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్థానంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
90 శాతం ఇందిరమ్మ ఇళ్లు పూర్తి..
నియోజకవర్గంలో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యేలా హౌసింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సూచించారు. హౌసింగ్ పీడీ గీత, డీఈఈ రాజలక్ష్మితో క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మొదటి విడతలో మంజూరైన 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు సుమారు 90 శాతం పూర్తయినట్లు తెలిపారు. రెండో విడతలో నియోజకవర్గానికి సుమారు 2,000 ఇళ్లు మంజూరు కానున్న నేపథ్యంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని సూచించారు.


